ఆట,పాటలతో చైతన్యం..
విజయనగరం, ప్రజా సంకల్పయాత్ర బృందం: వైఎస్సార్సీపీ విధి, విధానాలను ఆట,పాటలతో ప్రజలకు వివరిస్తూ చైతన్య పరుస్తున్నట్లు వైఎసాŠస్ర్సీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష తెలిపారు. గజపతినగరం నియోజకవర్గంలోని కెంగువ, ముచ్చర్ల, కొండపేట, జిన్నాంలలో ఆమె ప్రచార రథంపై మంగళవారం ఆట,పాటలతో చైతన్య పరిచారు. అనంతరం ఆమె సాక్షితో మాట్లాడుతూ, ఇడుపులపాయ నుంచి తాను ప్రజా సంకల్పయాత్రలో పాల్గొంటున్నట్లు చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. ఆయన మరణానంతరం చంద్రబాబును నమ్మి గెలిపిస్తే రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలకే అన్ని పథకాలు వర్తింపజేశారన్నారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, మళ్లీ రాజన్న పాలన కోరుకుంటున్నారని తెలిపారు.