నిరుద్యోగుల ఆత్మహత్యలు బాధాకరం..
ప్రతిపక్ష నేత జగన్ ఆవేదన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మహత్యలు బాధాకరమని గురువారం ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అమలులో ప్రభుత్వం విఫలమైంది.
రాష్ట్రం ఆవిర్భావం నుంచి లక్షా 43 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. దాని ఫలితమే నిరుద్యోగుల ఆత్మహత్యలు. నిరుద్యోగులు ఎవరూ అధైర్యపడొద్దు. అందరం కలసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందాం. జీవితం చాలా విలువైంది. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.