న్యూఢిల్లీ చేరుకున్న టీఆర్ఎస్ నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఓ వైపు సీమాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసి పడుతుంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ న్యూఢిల్లీలో అత్యంత వేగంగా పావులు కదుపుతుంది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బుధవారం ఉదయానికే న్యూఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని టీఆర్ఎస్ నేతలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలను కలవనున్నారు.
న్యూఢిల్లీ చేరుకున్న టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో కలసి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ అయి నూతన రాష్ట్రానికి ఏర్పాటుకు తీసుకోవలసిన చర్యలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు తమ ప్రయత్నాలను తీవ్రంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల న్యూఢిల్లీ బాట పట్టాడాన్ని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసినట్లు అయితే ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలి, లేదా రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలోని ఆ పార్టీ బృందం మంగళవారం రాష్టపతి, ప్రధానమంత్రిని కలసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ వైఖరి నిరసనగా వైఎస్ విజయమ్మ బుధవారం న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు.