నేడు వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ల రాష్ట్ర సమావేశం
బీచ్రోడ్లోని విశాఖ ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు
విశాఖ తూర్పులో 260వ రోజు పాదయాత్ర
విజయవంతం చేయాలని తలశిల రఘురాం పిలుపు
సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 260వ రోజు పాదయాత్ర మంగళవారం విశాఖ తూర్పు నియోజకవర్గంలో సాగనుందని పార్టీ ప్రొగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. మంగళవారం ఉదయం ఏడున్నర గంటలకు చినవాల్తేరు కనకమ్మ ఆలయం సమీపంలో రాత్రి బస శిబిరం నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర చినవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, బీచ్రోడ్డు మీదుగా విశాఖ ఫంక్షన్ హాలు వరకు సాగనుందన్నారు. ఉదయం 10 గంటలకు విశాఖ ఫంక్షన్ హాలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ల సమావేశంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గోనున్నారని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 25 పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, 175 అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొంటారని చెప్పారు.