ఆనందపురంలో నేడు బహిరంగ సభ
విజయవంతం చేయాలని తలశిల పిలుపు
సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆనందపురం జంక్షన్లో సోమవారం మ« ద్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ జరగనుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రొగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం వెల్లడించారు. విశాఖ జిల్లాలో చివరి బహిరంగ సభ కానుండడంతో ఈ సభకు భీమిలి నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రతి పక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర సోమవారం కూడా భీమిలి నియోజకవర్గ పరిధిలోనే సాగనుందన్నారు. 264వ రోజు సోమవారం గుమ్మడివానిపాలెం వద్ద నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర నీళ్లకుండీలు జంక్షన్, మామిడివానిపాలెం, గుడిలోవ జంక్షన్, తర్లువాడ క్రాస్, ఎల్వీ పాలెం, ఆనందపురం జంక్షన్ మీదుగా ఆనందపురం వరకు సాగనుందన్నారు. ఆనందపురం జంక్షన్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారన్నారు.
బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
విశాఖ సిటీ: ఆనందపురంలో జరిగే సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని పర్యవేక్షించి, భద్రత ఏర్పాట్లపై పోలీసులతో చర్చించారు. తలశిల వెంట పార్టీ నాయకుడు అక్కరమాని వెంకటరావు తదితరులున్నారు.