చోడవరం.. అభిమాన స్వరం
నేడు ఐదో నియోజకవర్గంలో ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం
గంధవరం వద్ద చోడవరంలో అడుగుపెట్టనున్న జగన్
మధ్యాహ్నం 3 గంటలకు కొత్తూరు జంక్షన్లో బహిరంగ సభ
విస్తృత ఏర్పాట్లు చేస్తున్న కో ఆర్డినేటర్ కరణం ధర్మశ్రీ
చోడవరం.. చైతన్యవంతమైన ప్రాంతం.అభిమానానికి పెట్టింది పేరు. సువర్ణపాలన అందించిన రాజశేఖరుడు.. కష్టసుఖాలు తెలుసుకునేందుకు తమ మధ్యకు వస్తున్న ఆయన తనయుడు జగన్మోహనుడు అంటే వారికెంతో ప్రాణం. నాలుగేళ్ల నరకాసుర పాలనతో విసిగి వేసారి, జననేతకు తమ వేదన వినిపించాలని వారు ఎదురుచూస్తున్నారు. ప్రజా క్షేమమే తన ఆశగా, శ్వాసగా ముందుకు సాగిపోతున్న ప్రియతమ నేతకు ఘన స్వాగతంపలకాలని ఉవ్విళ్లూరుతున్నారు.
సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో అప్రతిహతంగా సాగుతోంది. వరుసగా నాలుగు నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుని శనివారం ఐదో నియోజకవర్గంలో అడుగిడుతోంది. జిల్లాలో ప్రవేశించిన యాత్ర వరుసగా నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి నియోజక వర్గాల మీదుగా సాగి నేడు చోడవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు చోడవరం నియోజకవర్గ ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు.
రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డి అనకాపల్లి నియోజకవర్గం వూడేరు క్రాస్ శివారులో తాను బస చేసిన ప్రాంతం నుంచి శనివారం ఉదయం ఏడున్నర గంటలకు 251వ రోజు పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మామిడిపాలెం మీదుగా గంధవరం వద్ద చోడవరం నియోజకవర్గంలోకి ప్రజాసంకల్పయాత్ర ప్రవేశిస్తుంది. అక్కడ నుండి దుడ్డుపాలెం జంక్షన్, ముద్దుర్తి జంక్షన్, వెంకన్నపాలెం, అంభేరుపురం, గోవాడ గజపతి నగరం మీదుగా చోడవరం పెట్రోల్ బంకు వద్ద టౌన్లోకి అడుగుపెడుతుంది. టౌన్ నుంచి నేరుగా కొత్తూరు జంక్షన్కు చేరుకుని అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ప్రజలనుద్దేశించి జననేత ప్రసంగించనున్నారు. అనంతరం మెయిన్ రోడ్డు, ఆంధ్రాబ్యాంకు రోడ్డు, చినబజారు మీదుగా అన్నవరం జంక్షన్కు చేరుకుని అక్కడ రాత్రికి బస చేస్తారు.
నియోజకవర్గమంతా సందడే సందడే
మామిడిపాలెంలో జననేతకు ఘన స్వాగతం పలికేందుకు చోడవరం కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పాదయాత్ర సాగే దారుల్లో అడుగుకొక భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు, పార్టీ తోరణాలు, స్వాగత ద్వారాలతో ముస్తాబు చేశారు. నియోజకవర్గమంతా ఎటు చూసినా పండుగ వాతావరణం వెల్లివిరుస్తోంది. జననేత వెంట అడుగులో అడుగు వేసేందుకు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక పార్టీ శ్రేణులైతే ఉరిమే ఉత్సా హంతో జననేత వెంట కదం తొక్కేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు నర్సీపట్నం, కోటవురట్ల, యలమంచిలి, అనకాపల్లిలలో బహిరంగ సభలు జరిగాయి. ఈ çసభలన్నీ ఒకదానికి మించి ఒకటి జరిగాయి. వీటికి మించిన స్థాయిలో చోడవరం çసభ నిర్వహించాలన్న పట్టుదలతో పార్టీ కో ఆర్డినేటర్ ధర్మశ్రీ ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి సభకు వేలాదిగా జనం తరలివచ్చేందుకు ఉవ్విళ్లూరుతుండడంతో గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఈ సభ జరగనుందని అంచనా వేస్తున్నారు.