అనకాపల్లిలో నేడు బహిరంగ సభ

Today Public Meeting In Anakapalli - Sakshi

మధ్యాహ్నం 3 గంటలకు నెహ్రూచౌక్‌ వద్ద..

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 249వ రోజు మంగళవారం అనకాపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించనుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రొగ్రామ్స్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ తలశిల రఘురాం వెల్లడించారు. అనకాపల్లి నెహ్రూచౌక్‌ జంక్షన్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగసభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారన్నారు. జిల్లాలోని 13వ రోజు పాదయాత్ర మునగపాక మండల పరిధిలోని గ్రామాల మీదుగా సాగుతూ అనకాపల్లి నియోజకవర్గంలోకి అడుగుపెడు తుందన్నారు. మునగపాక మండలం తిమ్మరాజుపేట శివారులో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బుధవారం ఉదయం 7.30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుందన్నారు.

అక్కడ నుంచి మండల కేంద్రమైన మునగపాక, గంగాదేవిపేట క్రాస్, ఒంపోలు మీదుగా వెళ్లి వైఎస్‌ జగన్‌ నాగులాపల్లిలో మధ్యా హ్న భోజన విరామానికి ఆగుతారన్నారు. తిరిగి మధ్యాహ్నం పాదయాత్ర హైవే దాటుకుని అనకాపల్లి పట్టణంలోకి ప్రవేశిస్తారన్నారు. అనకాపల్లి మెయిన్‌ రోడ్డు, ఉమ్మలాడ క్రాస్‌ రోడ్డు, పూల్‌బాగ్‌రోడ్డు జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా నెహ్రూచౌక్‌కు చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగసభలో ప్రసంగించిన తర్వాత రైల్వే అండర్‌ బ్రిడ్జి, గాంధీనగర్, గుండాల జంక్షన్, చినబాబుకాలనీ, తుమ్మపాల మీదుగా సాగి శివారున ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top