కోట నందనవనంలో...అభిమాన జల్లు
17 నియోజకవర్గాలు..412 కిలోమీటర్లు..50 రోజులు..
జిల్లాలో 50 రోజుల పాదయాత్రకు నేడు వీడ్కోలు
గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి ప్రవేశం
అభిమాన కోట నందనవనంలో అభిమాన జల్లు కురిసింది. సోమవారం మధ్యాహ్నం పాదయాత్ర ప్రారంభంకాగానే కారు మేఘాలు కమ్ముకున్నాయి... ఆ వెంటే చినుకులు ... కుండపోత వర్షం...అయినా తరగని జనం. బారులుదీరిన మహిళలు...పిల్లలను చంకనేసుకొని ‘జగనన్న’ రాకకోసం ఎదురుచూపులు. వెళ్లే బాట బురద...గుంతల్లో నీరు...అయినా అడుగులన్నీ ముందుకే...తడిసి ముద్దవుతున్నా వెనుతిరిగేది లేదు. ఆ ఆత్మీయ పలకరింపులే 17 నియోజకవర్గాల్లో 412 కిలోమీటర్లలో 50 రోజులపాటు నడిపించగలిగింది. రాష్ట్రంలోనే సుదీర్ఘంగా జిల్లాలో సాగిన ప్రజా సంకల్ప పాదయాత్రకు మంగళవారం వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు సాదర వీడ్కోలు పలుకనున్నారు.
తూర్పుగోదావరి : అలుపెరగని ఆ అడుగులు గోదారమ్మ సాక్షిగా పశ్చిమ గట్టు నుంచి తూరుపు తీరంలోకి ప్రవేశించిన నాటి నుంచి ప్రజాసంకల్పయాత్ర ఏ గడ్డన సాగినా.. పుష్కర వేళ గోదావరి గట్టులా జనం పోటెత్తారు.నది, కడలుల నడుమ వైవిధ్యమెన నైసర్గిక స్వరూపం కలిగిన జిల్లాలో పాదయాత్ర ఎన్నో మజిలీలు చేరు కుంది. మైలురాళ్లను అధిగమించింది. రోడ్డుకం రైలు బ్రిడ్జిపై జిల్లా వాసులు అపూర్వ స్వాగతం పలకగా..జనగోదారి వెంట రాగా.. ‘జగన్నా’థుని పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. అక్కడి నుంచి యాత్ర పచ్చని కోనసీమలోకి ప్రవేశించి కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల మీదుగా సాగి అమలాపురంలో 200వ రోజు పూర్తి చేసుకుంది.
అనంతరం ముమ్మిడివరం నియోజకవర్గంలోని యానాం– ఎదుర్లంక బ్రిడ్జి మీదుగా రామచంద్రపురం, మండపేట చేరింది. అక్కడ 2500 కిలో మీటర్ల మైలురాయిని దాటింది. తర్వాత అనపర్తి, కాకినాడ రూరల్, కాకినాడ సిటీలకు చేరింది. జనసాగరాన్ని తలపించేలా జనం అక్కడ జరిగిన బహిరంగ సభకు తరలి వచ్చారు. అనంతరం పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గంలో సాగి 2600 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. జననేత జరిపిన పాదయాత్రలో 100వ నియోజకవర్గంగా జగ్గంపేట చరిత్రకెక్కింది. తర్వాత పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు మీదుగా తుని నియోజకవర్గంలోకి ప్రవేశించి, 2700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఇలా తూర్పు వీధుల్లో జననేత పాదముద్రలు అపూర్వమైన ఆదరణ సాక్షిగా నమోదయ్యాయి.