అంతా మాయ...!

Today Chandrababu Naidu Tour in Vizianagaram - Sakshi

నేడు భోగాపురానికి సీఎంచంద్రబాబు రాక

స్థలమెక్కడోతేలకుండానే గురజాడపేరుతో వర్శిటీ

ఎన్నికల్లో ప్రజలను మళ్లీ మభ్యపెట్టేప్రయత్నం

గంటలో ఆరు శంకుస్థాపనలు, బహిరంగ సభ

టీడీపీ తీరుపై విస్తుపోతున్న జనం

నిధులు, టెండర్లు లేకుండానేఉత్తుత్తిహడావుడి

ఏదైనా అభివృద్ధి పథకానికో... మరే ఇతర నిర్మాణానికో... శంకుస్థాపన చేయాలంటే దానికి సంబంధించి స్థల సేకరణ జరగాలి. టెండర్లు పూర్తికావాలి. నిధులు కేటాయించాలి. ఇవేవీ లేకుండానే పునాది రాయి వేసేస్తున్నారంటే ఏమనుకోవాలి. అసలు ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియని యూనివర్శిటీకి ఓ పేరు పెట్టి దానికో రాయి వేసేస్తే దానినేమనాలి. నాలుగున్నరేళ్లుగా గుర్తుకు రాని వరాలు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇవ్వడానికి హడావుడి చేస్తున్నారంటే... దానినేమనాలి. కచ్చితంగా అది మాయే కదా! రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలోని భోగాపురానికి గురువారం రానున్నారు. ఓ ఆరు పథకాలకు అక్కడే శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనంతటికీ కేటాయించిన సమయమెంతో తెలుసా... కేవలం ఒకే ఒక్క గంట.

సాక్షిప్రతినిధి, విజయనగరం: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు సంక్షేమ పథకాల పేరుతో తెగ హడావుడి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని నాలుగున్నరేళ్లపాటు పట్టించుకోని వారు కొద్ది రోజులుగా జిల్లాల్లో తెగ తిరిగేస్తు్తన్నారు. ఏ మాత్రం అడుగు పడని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, గురజాడ యూనివర్శిటీ, డిగ్రీ కళాశాలతో పాటు మరో మూడు ప్రైవేట్‌ ప్రాజెక్టులకు గురువారం భోగాపురంలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఇంకా టెండర్లు ఖరారు కాకుండా, నిధులకేటాయింపులు లేకుండా చేస్తున్న ఈ హడావుడిని చూసి జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు.

పనులెవరికిచ్చారు
ఏదైనా ఒక అభివృద్ధి పని ప్రారంభించాలంటే అంచనాలు రూపొందించాలి. పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలి. నిధులు కేటాయించాలి. పనుల నిర్వహణకు టెండర్లు పిలవాలి. ఆపై సాంకేతిక అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత మాత్రమే శంకుస్థాపన కార్యక్రమాలు గతంలో జరిగేవి. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు విషయంలో ఈ ప్రక్రియేదీ పూర్తికాలేదు. ప్రభుత్వం భూసేకరణ మాత్రమే పూర్తి చేసి 2700 ఎకరాలు సిద్ధం చేసింది. నిర్వాసితులకు ఇంకా రూ.5 లక్షలు చొప్పున ఇవ్వాల్సి ఉంది. అవి ఇవ్వకుండా శంకుస్తాపనకు వస్తే జనం నిలదీస్తారని భయపడి ఒక్కరోజు ముందే అంటే బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో రూ.35 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రాజెక్టు పనులు మంజూరు చేసినా టెండర్లు ఖరారు కాలేదు. ఒకసారి ఖరారైన టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత ఇంతవరకు టెండర్లు జరగలేదు.

పనులు ఎవరికీ అప్పగించలేదు. అసలు పనులు ఎవరు చేస్తారో తెలియదు. మరోవైపు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే పౌరవిమాయానశాఖకు సంబంధించినది. పనుల నిర్వహణ ఎవరు చూస్తారు? పనుల పర్యవేక్షణ ఎవరు చేపడతారనేది ఇంతవరకూ తేల్చలేదు. ఇవన్నీ కొలిక్కి తేకుండానే శంకుస్థాపన చేసేందుకు నిర్ణయం తీసుకోవడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. ఎన్నికలు వస్తుండడంతో తమ హయాంలోనే ఇవన్నీ చేశామని చెప్పుకోవడానికే శంకుస్థాపన డ్రామాకు తెరదీశారని అర్థమవుతోంది.

నాలుగున్నరేళ్లు రాని ప్రాజెక్టులు...
నాలుగున్నరేళ్లుగా ఇదిగో వచ్చేస్తున్నాయ్, అదిగో వచ్చేస్తునాయంటూ జిల్లాకు భారీ ప్రైవేటు ప్రాజెక్టులను చూపించారు. వాటిలో ఏ ఒక్కటీ ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. ఏళ్ల తరబడి అవి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. వాటిలో మూడు ప్రాజెక్టులకు ఇప్పుడు సీఎం చాలా గొప్పగా శంకుస్థాపన చేస్తున్నారు. కానీ ఇవి కూడా ఈ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించే అవకాశం ఏమాత్రం లేదు. కేవలం అభివృద్ధి పనుల విషయంలో ఇంత హడావుడి పనికి రాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అధికారపార్టీ నాయకులు అడ్డుగోలుగా శంకుస్థాపన కార్యక్రమాలు పెట్టి అధికారుల సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

ఎక్కడ కడతారో తెలియకుండానే...
కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో జిల్లాలో గురజాడ యూనివర్శిటీ, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని, ఒక డీగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వీటికి సంబంధించిన అధికారిక జీవో కూడా ఇంకా విడుదల కాలేదు. పైగా వీటిని ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న అంశం తేలలేదు. భూమి కూడా సిద్ధం చేయాల్సి ఉంది. ఆపై అంచనాలు తయారు చేసి నిధులు మంజూరు చేసి, టెండర్లు ఖరారు చేసి, పనులు కాంట్రాక్టర్లకు అప్పగించాలి. అప్పుడే పనుల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేయాల్సి ఉన్నా అవేవీ పట్టించుకోకుండా హడావుడిగా భోగాపురం నుంచే అన్నిటికీ శంకుస్థాపన చేసేస్తున్నారు.  వీటిలో మెడికల్‌ కళాశాల లేకపోవడం కొసమెరుపు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top