రాజధానిగా త్రినగరిని ప్రకటించాలి
ఏలూరు(ఆర్ఆర్ పేట) : ఏలూరు, గుంటూరు, విజయవాడ కలిసిన త్రినగరిని నూతన ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ప్రకటించాలని పలువురు వక్తలు కోరారు. జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్, జిల్లా ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఏలూరులో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అధిక అక్షరాస్యత సాధించిన జిల్లా అయిన పశ్చిమ గోదావరిలో ఐఐటీ, నిట్ తదితర 13 జాతీయ స్థాయి సంస్థల్లో ఏదొకటి ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, చింతలపూడి, ప్రాంతాల్లో అటవీ బంజరు భూములు అధికంగా ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఏర్పాటు చేయవచ్చన్నారు.
తాడేపల్లిగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజిగా చేయాలని, ఇక్కడి జిల్లా కోర్టు ప్రాంగణం హైకోర్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందన్నారు. నరసాపురంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసి, లేసు పార్కును అభివృద్ధి చేయాలని, భీమవరాన్ని ఆక్వా హబ్ను చేయాలని సూచించారు. జిల్లాలోని రెండు పంచారామాలు, పాపి కొండలు, కొల్లేరు ప్రాంతాలను అభివృద్ధి చేస్తే జిల్లా ఉత్తమ పర్యాటక కేంద్రంగా అవుతుందన్నారు.
ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియాన్ని జాతీయ స్టేడియంగా ప్రకటించాలని డిమాండు చేశారు. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే అంతర్జాతీయ స్థాయికి చేరుతుందన్నారు. ఈ అభిప్రాయాలను తీర్మానం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపాలని సమావేశం నిర్ణయించింది. పారిశ్రామికవేత్త బ్రిజ్ గోపాల్ లునాని అధ్యక్షత వహించిన సమావేశంలో మర్చంట్స్ చాంబర్ అధ్యక్షుడు నేరెళ్ల రాజా, ఉపాధ్యక్షుడు వంకాయల రామకృష్ణ, శ్రీశ్రీ విద్యా సంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ, సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత కోనేరు సురేష్ బాబు, డాక్టర్ ఎంఎల్వీ ప్రసాద్, ఎంబిఐ మేనేజర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.