సామాజిక మాధ్యమాల్లోకి శ్రీవారు
సాక్షి, తిరుమల: భక్తులారా.. శుభోదయం, కౌసల్యా సుప్రజా రామ.., గుడ్మార్నింగ్, అంటూ ఇక నిత్యం మన మొబైల్ఫోన్లలో తిరుమలేశుడు వివిధ రూపాల్లో ఆశీస్సులు అందించనున్నారు. సమాచార విప్లవంలో రోజురోజుకూ పెరిగిపోతున్న సామాజిక మాధ్యమాలను కూడా ఒడిసి పట్టుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు ప్రారంభించింది. ధర్మప్రచారంతో పాటు ప్రజల జీవన విధానంలో నైతికత పెంపొందించేందుకు వీలుగా శ్రీవారి చిత్రాలతో కూడిన సూక్తులు, పూజా విధానం మొబైల్ వీడియో క్లిప్పింగులు రూపొందించాలని భావిస్తోంది.
నిత్యం వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాదుల ఆభరణాలు, సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలంకరాలతో కొలువుదీరే స్వామివారు ఒక్కో సేవలో, ఒక్కో రూపంలో దర్శనమిస్తుంటారు. అలాంటి చిత్రాలు (ఫొటోలు), వీడియో లైవ్ క్లిప్పింగుల ప్రోమోలు అనేకం టీటీడీ వద్ద ఉన్నాయి. అలాంటి వాటిని సులభంగా ప్రసారం చేసేందుకు వీలుగా మొబైల్ఫోన్ వెర్షన్కు మార్చాలని నిర్ణయించారు. వీటిని వాట్సప్, టెలిగ్రామ్లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా సామాన్య భక్తులకు అందుబాటులోకి తేవాలని టీటీడీ సంకల్పించింది. ఆ దిశగా శ్రీవారి చిత్రాలు, నిమిషం నుండి ఐదు నిమిషాల నిడివిగల వీడియోలు రూపొందిస్తోంది.