వైఎస్సార్ సీపీ ఓటర్లే టార్గెట్
సర్వేరాయుళ్ల లక్ష్యమిదే...
విజయనగరం, బలిజిపేట: మండలంలో వైఎస్సార్ సీపీ ఓటర్ల వివరాల సేకరణ ఒక ప్రహసంలా మారింది. ఐదు రోజుల నుంచి గ్రామాలలో సర్వేరాయళ్లు తిరుగుతూ పార్టీ సానుభూతిపరులు, అభిమానుల వార్డులు, గ్రామాలను టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగా గళావల్లి, నారాయణపురం, గౌరీపురం, మిర్తివలస, సుబద్ర తదితర గ్రామాలలో సర్వేరాయుళ్లు తిరుగుతున్నారు. నారాయణపురం దేవాంగుల వీధిలో ఓటర్లను సర్వే చేస్తున్న వ్యక్తిపై అనుమానంతో వీధివాసులు పట్టుకుని ఏమిటీ సర్వే అని నిలదీశారు.
గ్రామాలలో వీధి రోడ్లు ఉన్నాయా లేదా, కాలువలు ఉన్నాయా లేదా, మీకు కలుగుతున్న ఇబ్బందులు ఏమిటనేవి ప్రశ్నిస్తు వాటితో పాటు రాజకీయ వ్యవహారాలను ప్రశ్నించి వారు చెప్పే జవాబులను ట్యాబ్లలో ఫీడ్ చేశారు. సుబద్రలో తిరుగుతూ 15మంది వైఎస్సార్ సీపీ ఓటర్ల పేర్లను అడిగినట్టు పార్టీ కార్యకర్తలు తెలిపారు. అనుమానం వచ్చి వారిని పట్టుకుని పోలీస్ శాఖకు ఫిర్యాదు చేశారు. నారాయణపురంలో పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పచెప్పగా సర్వేరాయుళ్లు గ్రామంలో వీధులు, కాలువల పరిస్థితి, రోడ్లు ఉన్నాయా లేదా అని అడుగుతున్నట్టు పోలీసులకు చెప్పడం జరిగింది. దీంతో వారు వారుచెప్పే అబద్దపు మాటలను నమ్మి వారిని విడిచిపెట్టారు. ఆ తరువాత రోజు సుబద్రలో సర్వేరాయుళ్లు వైఎస్సార్ సీపీ కార్యకర్తల పేర్లు 15 చెప్పమని పార్టీ కార్యకర్తను కోరగా సర్వేరాయడుని కార్యకర్త నిలబెట్టి నాయకులకు అప్పగించారు. దీంతో గ్రామాలలో వైఎస్సార్ సీపీ ఓట్లు ఉంటాయా లేదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారిని అనుమతించవద్దని పోలీస్ శాఖను కోరుతున్నారు.