పండగచేస్కో!

TDP Leaders Wastage People Funds in Festival - Sakshi

సంబరాల పేరుతో ప్రజాధనం దుబారా

నాలుగున్నరేళ్లలో     రూ.30 కోట్లకుపైగా ఖర్చు

నేడు నారావారిపల్లెకు     సీఎం చంద్రబాబు రాక

మొదలైన అధికార పార్టీ     నాయకుల హడావుడి

ప్రజాధనంతో అధికార పార్టీ పండగ చేసుకుంటోంది. ఆర్భాటాలు, హంగామాల కోసం కోట్ల రూపాయల నిధులు దుబారా చేస్తోంది. తమ పార్టీ నాయకుల చేతులకు చమురంటకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. జిల్లాలో నాలుగున్నరేళ్లలో సుమారు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేయడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇందులో అధికార పార్టీ నాయకుల పెత్తనం అంతాఇంతా కాదు. ఇప్పుడు నారావారిపల్లె అందుకు వేదికయ్యింది. సంక్రాంతి కోసమని సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేయనున్నారు. అక్కడ రెండో రోజుల పాటు చేసే వివిధ కార్యక్రమాలకు ప్రజాధనాన్నే వెచ్చిస్తున్నట్లు సమాచారం.

చిత్తూరు కలెక్టరేట్‌: సీఎం చంద్రబాబునాయుడుకు పండగొచ్చినా.. పబ్బమొచ్చినా భలే సరదా. స్వగ్రామానికి రావడం.. అక్కడ భారీ ఏర్పాట్లు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. దీనికయ్యే ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచే వెచ్చించడం రివాజుగా మారుతోంది. 

సంక్రాంతికి నారావారిపల్లె సిద్ధం..
సీఎం స్వగ్రామమైన నారావారిపల్లిలో సంక్రాం తి శోభ ఉట్టిపడుతోంది. గ్రామీణ సంప్రదా యం నడిచి వచ్చేలా వేడుకలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలందాయి. దీంతో వారు అలెర్ట్‌ అయ్యారు. ఎక్కడాలోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వివిధ క్రీడా పోటీలతో పాటు డ్వాక్రా మహిళల చేత ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. విజేతలకు సీఎం కుటుంబ సభ్యుల చేతుల మీదుగా బహుమతులు అందజేసేందుకు సిద్ధమయ్యారు.

తమ్ముళ్లదే హవా..
ఇటీవల జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో టీడీపీ నాయకుల హవా కొట్టొచ్చినట్టు కనిపిం చింది. చిన్నచిన్న కాంట్రాక్ట్‌ పనుల నుంచి సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం వెచ్చించే నిధులలో అధిక భాగం ఆ పార్టీ నాయకులకే కట్టబెట్టారు. టీడీపీ ప్రభుత్వం వారి ప్రచారం కోసం చేపడుతున్న అట్టహాస కార్యక్రమాలను చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రతి అంశాన్నీ రాజకీయ ప్రయోజనం కోసమే వెచ్చిస్తున్నారు. ప్రజాధనంతో పబ్లిసిటీ ఇచ్చుకోవడం ఆ పార్టీ నాయకులకు సర్వసాధారణమైపోయింది.

సొమ్మొకరిది..సోకొకరిది
ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శించడం.. క్షేత్రస్థాయిలోకొచ్చే సరికి కేంద్ర ప్రభుత్వ పథకాలను తామే ప్రారంభించామని పబ్లిసిటీ ఇచ్చుకోవడం షరా మామూలైపోయింది. నాలుగున్నరేళ్లుగా సంప్రదాయ పండుగలకు పచ్చ కలర్‌ వేసేందుకు సర్కారు ఖజానాకు తూట్లు పొడిచారనే ప్రచారం సాగుతోంది.    పండగల పేరుతో దుబారా చేసే బదులు పేదల మౌలిక సదుపాయాలు, ఇతరత్రా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సొంత డబ్బులైతే కదా?
క్షేత్రస్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలు కోకొల్లలు. వాటిపై దృష్టి పెట్టడానికి చిత్తశుద్ధి లేదు. నాలుగున్నరేళ్లుగా సంప్రదాయ పండుగల పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుబారా చేస్తోంది. ఆ వేడుకల వల్ల ఎవరికీ ఒరిగింది లేదు.        – నాగరాజన్,    సీపీఐ నాయకులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top