ఎమ్మెల్యే కుటుంబం గుప్పెట్లో డీపట్టా భూములు
విశాఖపట్నం : ‘మా గ్రామంలోని 10 మంది దళితులకు 1999లో ప్రభుత్వం అర ఎకరా వంతున భూమి కేటాయించి డీ పట్టాలను అందజేసింది. సర్వే నంబరు 156లో ఉన్న ఈ భూముల చేరువలో గల సుమారు వంద ఎకరాల ప్రభుత్వ భూములను అనకాపల్లి ఎమ్మెల్యే పీలా కుటుంబ సభ్యులు ఆక్రమించారు. అంతటితో ఆగక మా డీ పట్టా భూములను కూడా కబ్జా చేశారు. దీనిపై వారిని నిలదీసి అధికారులకు ఫిర్యాదు చేశాం. ఆ కారణంగా మాపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు చంపుతామని బెదిరిస్తున్నారు. ఇటీవల సిట్ కూడా ఫిర్యాదు చేయగా విచారణ జరిపి భూమిని అప్పగిస్తామని తెలిపిన అధికారులు పత్తా లేకుండా పోయారు.’ అని భీమిలి నియోజకవర్గం ఆనందపాలెం మండలం భీమన్నదొర పాలెం ఎస్సీ కాలనీకి చెందిన భూ బాధితులు గండ్రేటి గురమ్మ, జొన్నపల్లి రాములమ్మ, గుడివాడ బంగారమ్మ తదితరులు తెలిపారు. ఈ భూములే తమకు జీవనోపాధి అని, ఎమ్మెల్యే ఆగడాల నుంచి తమను కాపాడి భూములు ఇప్పించాలని కోరారు.