టీడీపీకి గుడ్బై...
విజయనగరం, ప్రజాసంకల్పయాత్ర బృందం: గజపతినగరం మండలంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ గార అప్పలస్వామి తెలుగుదేశం పార్టీను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం గజపతినగరం మండలంలో పాదయాత్ర చేపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి మధ్యాహ్న భోజన విరామ శిబిరం వద్ద ముచ్చర్ల తాజా మాజీ సర్పంచ్ గార అప్పలస్వామికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తాజా మాజీ సర్పంచ్ అప్పలస్వామి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని, నాయకులు, కార్యకర్తలకు గౌరవం ఉంటుందని తెలిపారు. గజపతినగరం నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నానని, ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి పార్టీకు సేవలందించానని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే తీరుతో పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనర్సయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గార తౌడు పాల్గొన్నారు.