బాబు నా కజిన్.. లోకేశ్ బాగా క్లోజ్
ఇదీ.. నర్రా కృష్ణారావు చేసే మోసాల తీరు
సాక్షి, అమరావతి బ్యూరో: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నా కజిన్.. లోకేశ్ నాకు బాగా క్లోజ్..’ అని పారిశ్రామికవేత్తలను పరిచేయం చేసుకుంటాడు. ‘నేను టీడీపీ ఆర్థిక విభాగం అధ్యక్షుడిని.. బాబుకు చెందిన హెరిటేజ్ సంస్థలోనూ నాకు వాటాలున్నాయ్.. అప్పట్లో ఆయన పాదయాత్రకు గాను అంతా నేనే చూసుకున్నా..’ అని చెబుతూ చంద్రబాబు పాదయాత్ర సమయంలో ఆయనతో దిగిన ఫొటోలు కూడా చూపిస్తూ.. వారిని బుట్టలో వేసుకుంటాడు.
త్వరలోనే రాజ్యసభ సభ్యుడినవుతానని, పెద్దలచే పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టిస్తానని చెప్పి పారిశ్రామిక వేత్తల నుంచి ఖర్చుల పేరుతో రూ.కోట్లు వసూలుచేసి ఆ తర్వాత పత్తా లేకుండా పోతాడు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగుల కు వల విసిరి వారి నుంచీ కాసులు కొల్లగొట్టి పలాయనం చిత్తగిస్తాడు.. ఇదీ.. నర్రా కృష్ణారావు చేసే మోసాల తీరు. కృష్ణారావుతోపాటు ఆయన భార్య ఇంద్రాణిపై ఇప్పటికే హైదరాబాద్లో పలు కేసులు నమోదయ్యాయి.
కృష్ణా జిల్లా నందిగామలోని మైక్రో కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత మేదరమెట్ల వైకుంఠలక్ష్మీ నారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో కృష్ణారావు బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కృష్ణారావు, ఆయన భార్య ఇంద్రాణి, సోదరి శ్రీలతను విజయవాడ పోలీసులు అరెస్టుచేశారు. దాంతో ఆ దంపతుల చేతిలో మోసపోయిన వారు బయటకొస్తున్నారు.
సంబంధిత వార్తలు