వైద్య సేవలందించడంలో సర్కారు విఫలం

వెంకటాచలం: విష జ్వరాల బారినపడిన ప్రజలకు వైద్య సేవలందించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. వెంకటాచలంలోని ఎంపీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దోమలపై దండయాత్ర చేపట్టారని, అయితే జిల్లాలో దోమల కారణంగా జ్వరాలు ప్రబలి సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా ప్రచార ఆర్భాటం తప్ప ప్రయోజనం ఉండటంలేదన్నారు.

 మనుబోలు మండలంలోనే నలుగురు డెంగీతో మరణించినా జిల్లా యంత్రాంగం వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి పేద ప్రజలకు వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. పీహెచ్‌సీల్లో డెంగీని గుర్తించే పరికరాలు లేవన్నారు. వ్యాధిని గుర్తించేలోగా రోగులు మృతిచెందడం జరుతోందన్నారు. డెంగీని ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకంలో చేర్చాలని డిమాండ్‌చేశారు. ప్రతి మండలంలో చాలావరకు మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తికాకున్నా ఓడీఎఫ్‌లో జిల్లాకు మొదటి స్థానం వచ్చిందని చెప్పడం ఏంటని ప్రశ్నించారు.

 క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మరుగుదొడ్లు వినియోగంలో లేవనే విషయం తెలుస్తుందన్నారు. సమావేశంలో ఎంపీపీ తలపల అరుణ, జెడ్పీటీసీ వెంకటశేషయ్య, మండల ఉపా«ధ్యక్షుడు శ్రీధర్‌నాయుడు, వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ కె.చెంచు కృష్ణయ్య, జిల్లా కో–ఆప్షన్‌ సభ్యుడు అక్బర్‌బాషా, మండల కో–ఆప్షన్‌ సభ్యుడు హుస్సేన్, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శులు కె.మోహన్‌నాయుడు, వి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top