గిరిజనుల అణచివేతకు సర్కారు కుట్ర
ఆళ్లగడ్డ: ‘టీడీపీ ప్రభుత్వం గిరిజనుల అణచివేతకు కుట్ర పన్నుతోంది.. ప్రతిపక్షనేతగా మీరు గిరిజనులను ఆదుకోవాలి’ అని ఆల్ఇండియా బంజార సేవాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటరమణనాయక్ వైఎస్జగన్ను కోరారు. బనగానపల్లె నియోజకవర్గంలోని ఇల్లూరు కొత్తపేట సమీపంలో పాదయాత్ర జరుగుతుండగా ఆదివారం ఆల్ఇండియా బంజార సేవాసంఘం నాయకులు జగన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గిరిజనులు వెనుకబడి ఉన్నారన్నారు. స్వయం ఉపాధి పథకాలు అందక విద్య, వైద్యం, ఉపాధికి దూరంగా అర్ధాకలితో అలమటిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో గిరిజనుల సమస్యలను పరిష్కరించాల్సిన టీడీపీ ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఇతర కులాలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తామని ప్రకటన చేయడం బాధాకరం అన్నారు. కులాలకు, మతాలకు మధ్య గొడవలు పెడుతున్న టీడీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి గిరిజనులు సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు.