మాటలే మిగిలాయి..
గ్రామాలను అభివృద్ధి చేయడం లేదు..
సమస్యలతో సహవాసం చేస్తున్నాం..
జగన్మోహన్రెడ్డికి సమస్యలు వివరించిన విద్యార్థినులు
గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలని పాలకులు ప్రకటనలు గుప్పిస్తున్నారే తప్ప ఆచరణలో అభివృద్ధి చేయడం లేదు. చాలా గ్రామాల్లో కనీసం మౌలిక వసతులు కూడా లేవు. పట్టించుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జనహిత డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్ర పార్వతీపురం మండలం మీదుగా సాగుతున్న క్రమంలో సూరంపేట క్రాస్ వద్ద జనహిత డిగ్రీ కళాశాల విద్యార్థినులు జననేత జగన్మోహన్రెడ్డిని శనివారం కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండలంలోని పలు గ్రామాల్లో అపారిశుద్ధ్యం రాజ్యమేలుతోందన్నారు.
చినగుడబ, తేలునాయుడువలస గ్రామాల నుంచి పార్వతీపురం వరకు బస్సు సౌకర్యం లేక ప్రజలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ములగ గ్రామంలో బ్రిడ్జి విరిగిపోవడంతో గ్రామానికి బస్సు రావడం లేదని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో అర్హులైన వృద్ధులు ఎంతో మంది ఉన్నా చాలా మందికి పింఛన్ అందడం లేదని.. ఆడపిల్లల ఉన్నత విద్యను ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని చెప్పారు. గరుగుబిల్లి గ్రామానికి ఆస్పత్రి అందుబాటులో లేకపోవడంతో ప్రజలకు వైద్యసేవలు అందడం లేదన్నారు. టీడీపీ పాలన అధ్వానంగా ఉందని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరారు. సమస్యలన్నీ సావదానంగా విన్న జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు.
– ప్రజా సంకల్పయాత్ర బృందం