రంగంలోకి రౌడీ ఏజెంట్లు?

TDP Agents Ready For Conflicts on Counting Day - Sakshi

కౌంటింగ్‌లోనూ అల్లర్లకు టీడీపీ కుట్రలు

ఓటమి భయంతో బరితెగిస్తున్న అధికార పార్టీ

కేసులు, నేరప్రవృత్తి కలిగిన వారికి కౌంటింగ్‌ ఏజెంట్ల ముసుగు

అటువంటి వారికే పాస్‌లు ఇవ్వాలని జాబితాలు

వారిలో చాలామందిపై బైండోవర్, కొట్లాట కేసులు

ఉన్నాయని ప్రాథమికంగా నిర్థారణ

సర్కారీ సొమ్ముతో ఓట్ల కొనుగోలు పథకాలు.. డబ్బులు, ఇతరత్రా తాయిలాలు.. ఇలా ఎన్ని రకాలుగా మభ్యపెట్టడానికి ప్రయత్నించినా ఓటర్లు అధికార పార్టీ మాయలో పడలేదని పోలింగ్‌ సరళి స్పష్టం చేసింది.
రకరకాల అంచనాలు, లెక్కలు వేసుకున్న టీడీపీ నేతలకు  మచ్చుకైనా గెలుపు ధీమా దక్కలేదు. అందుకనే పోలింగ్‌ రోజు నుంచీ ఈవీఎంలపైనా, ఎన్నికల కమిషన్‌పైనా అభాండాలు వేస్తూనే మరోవైపు తమకు అత్యధిక సీట్లు వస్తాయని బింకంగా ప్రకటించుకుంటున్నారు. అయితే ఓటమి భయం నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు.

దాంతో పోలింగ్‌ రోజు చేసినట్లే.. ఓట్ల లెక్కింపు రోజు కూడా అల్లర్లు, వివాదాలు సృష్టించి యాగీ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా కౌంటింగ్‌ కేంద్రాల్లోకి రౌడీలు, నేరచరిత్ర కలిగిన వారిని చొప్పించాలని చూస్తున్నారు. వారికి ఏజెంట్ల ముసుగు వేసి పాస్‌లు ఇప్పించాలని కుట్రలు పన్నుతున్నారు.

టీడీపీ తరఫున పాస్‌ల కోసం అధికార యంత్రాంగానికి ఆ పార్టీ అందజేసిన జాబితాలో పోలీసులు ఇప్పటికే బైండోవర్‌ చేసిన పలువురి పేర్లు ఉండటాన్ని గుర్తించారు. అటువంటి వారిపై సమగ్ర విచారణ జరుపుతుండగా.. నామమాత్రపు విచారణతో సరిపెట్టాలని కూడా పోలీసు యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.

సాక్షి, విశాఖపట్నం : విశాఖ జిల్లాలో 3 లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో 23న జరుగనుంది. ఇందుకోసం అభ్యర్థుల వారీగా కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకం జరుగుతోంది. బరిలో ప్రతి అభ్యర్థి తరపున ఏజెంట్లను నియమించుకునే వెలుసుబాటు ఉంటుంది. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్‌ ఏర్పాటు చేస్తారు. అలాగే పోస్టల్, సర్వీస్‌ ఓట్లను లెక్కించేందుకు రెండుటేబుల్స్‌ అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థి తరపున ప్రతి టేబుల్‌కు ఓ ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. జనరల్‌ ఏజెంట్లతో పాటు కౌంటింగ్‌ ఏజెంట్లు కలిపి ఒక్కో అభ్యర్థి 30 మందికి తక్కువ కాకుండా నియమించుకునే అవకాశం ఉంది. కౌంటింగ్‌ ఏజెంట్ల నియామక ప్రక్రియ ఈ నెల 20వ తేదీకల్లా పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికే అభ్యర్థులతో ఆర్వోలు, ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహించి కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకం..తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కూడా కల్పించారు. అభ్యర్థులు, పార్టీలు నియోజకవర్గాల వారీగా తమ ఏజెంట్ల జాబితాను ఆర్వోలకు అందజేశారు.

టీడీపీ జాబితాల్లో బైండోవర్‌ అయినవారు
ఆజాబితాలను స్టేషన్ల వారీగా పంపి వారి గత చరిత్రపై విచారణ జరిపిస్తున్నారు. ఇతర పార్టీలతో పోల్చుకుంటే టీడీపీ ఏజెంట్లలో అత్యధికులపై బైండోవర్‌ కేసులు నమోదైనట్టుగా గుర్తించారు. 2009, 2014 ఎన్నికల్లోనే కాదు.. ప్రస్తుత ఎన్నికల్లో కూడా వీరిలో చాలా మందిపై బైండోవర్‌ కేసులున్నట్టుగా ప్రాధమికంగా పోలీసులు నిర్ధారించారు. మరికొంత మందిపై కొట్లాటలు..దాడులు వంటి ఘటనల్లో పాల్గొన్న నేపథ్యం ఉన్న వారు కూడా ఉన్నట్టుగా గుర్తిం చారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో కాస్త తీవ్రత ఎక్కువగా ఉండే సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో భాగస్వాములైన వారు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. విశాఖ దక్షిణం, పెందుర్తి, నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల్లో ఇటీవలే బైండోవర్‌  చేసిన పలువుర్ని ఏజెంట్లుగా సిఫార్సు చేసినట్టుగా స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు నిర్ధారించారు.

కొట్లాటలు, దాడుల్లో నిందితులు సైతం
గాజువాక, పశ్చిమ అనకాపల్లి నియోజకవర్గాల్లో గతంలో కొట్లాటలు, దాడుల్లో పాల్గొన్న వారు సైతం ఏజెంట్లుగా ఉన్నారు. స్టేషన్ల వారీగా వచ్చిన జాబితాలకనుగుణంగా వారిపై నమోదైన కేసులు, నేరప్రవత్తిని పేర్కొంటూ జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తారు. కాగా చాలా నియోజకవర్గాల్లో కౌంటింగ్‌ ఏజెంట్లపై పోలీసు విచారణ నామమాత్రంగా సాగుతుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. తామిచ్చిన జాబితాలను యథాతథంగా అఅప్రూవ్‌ చేసి ఉన్నతాధికారులకు పంపాలని ఒత్తిళ్లు వస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ మేరకు డీఎస్పీలకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు కూడా అందినట్టుగా తెలియవచ్చింది. ఏమైనా వస్తే తాము చూసుకుంటామని వారికి సూచించి నట్టుగా చెబుతున్నారు. ఇలా వచ్చిన జాబితాలను జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు ఆర్వోలకు పంపిస్తారు. చివరకు జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ ఆమోదముద్రతో ఏజెంట్లకు కౌంటింగ్‌ పాస్‌లు జారీచేస్తారు. వారిపై నమోదైన కేసులతీవ్రతను బట్టి జిల్లా ఎన్నికల అధికారి వార్ని పక్కన పెట్టే అవకాశాలున్నాయి.

రచ్చ చేయడం.. ప్రత్యర్థిపై నేట్టేయడం.. ఇదీ స్కెచ్‌
సాధారణంగా ఎన్నికల నిబంధనల మేరకు ఎలాంటి కేసులు లేని వారు, నేరప్రవృత్తి లేని వార్ని మాత్రమే సిఫార్సు చేయాల్సి ఉంది. కానీ టీడీపీ అభ్యర్థులు మాత్రం ఓటమి భయంతో నేరప్రవర్తి కల్గి కాస్త దుందుడుకు స్వభావం కల్గిన వార్ని ఎంచుకుని మరీ ఏజెంట్లుగా సిఫార్సు చేశారు. కౌంటింగ్‌లో ఏ చిన్న సమస్య ఎదురైనా అధికారులపై విరుచుకుపడిపోవాలని, అవసరమైతే గలాటా సృష్టించి ఆ నెపం ప్రత్యర్థి పార్టీలపై నెట్టేయాలని వారికి హితబోధ చేసినట్టుగా చెబుతున్నారు. ఓటమి పాలయ్యే పరిస్థితి ఉత్పన్నమైతే ఏదో విధంగా అలజడలు సృష్టించి కౌంటింగ్‌ ప్రక్రియను అడ్డుకోవాలని వారికి ఉపదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందువలన ఒకటికి రెండుసార్లు నేర ప్రవృత్తి కల్గిన వారి విషయంలో అధికారులు ఆచితూచి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లో..గతంలో తమకు మేలు చేసారన్న కృతజ్ఞతతో ఏజెంట్లుగా అవకాశం ఇస్తే ఉద్దేశ్యపూర్వకంగా వీరు ఏ చిన్న అలజడి సృష్టించి కౌంటింగ్‌ ప్రక్రియకు విఘాతం కల్గించినా అందుకు సంబంధిత ఆర్వోలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top