మీవెంటే మేముంటాం
శ్రీకాకుళం :వివక్షపూరిత రాజకీయాలతో విసిగిపోయారు.. అండగా ఉంటారని నమ్మి ఓటేసి గెలిపిస్తే నట్టేట ముంచడంతో తట్టుకోలేకపోయారు.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తిరిగి రావాలంటే ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమని బలంగా విశ్వసిస్తూ ఆయనకు భరోసాగా నిలుస్తున్నారు. మీవెంటే మేముంటామంటూ జగనన్న అడుగులో అడుగు వేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకుంటున్నారు.– ప్రజా సంకల్పయాత్ర బృందం
మీ పాలనే రావాలి..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో రాయపాడు గ్రామంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగాయి. తర్వాత వచ్చిన పాలకులు మా గ్రామాన్ని పట్టించుకోవడం మానేశారు. మా గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన 200 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మేమంతా వైఎస్సార్ కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నామని ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. అనేక మంది పింఛన్లు తొలగించారు. బీసీ కార్పొరేషన్, వ్యవసాయ రుణాలు అందజేయడం లేదు. మీ పాలన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. – పల్ల అమరావతి, రాయపాడు, శ్రీకాకుళం