జీవితానికి టిక్‌ పెట్టొద్దు

Special story On Social Media Application TikTok - Sakshi

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ టిక్‌ టాక్‌తో కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. కాపురాల్లో చిచ్చు పెట్టడమే కాదు.. ఉద్యోగాలకూ ఈ యాప్‌ ఎసరు పెడుతోంది. ప్రచార యావతో.. అనర్థాలను కొనితెచ్చుకుంటున్నారు. ప్రస్తుత సామాజిక మాధ్యమాల్లో చిన్న చిన్న వీడియోలు రూపొందించే టిక్‌ టాక్‌ యాప్‌ ద్వారా చాలామంది ప్రచారం పొందుతున్నారు. గ్రామాల నుంచి నగరాల వరకు ఈ యాప్‌ చర్చనీయాంశమవుతోంది. పాటలు, నృత్యాలు, సినిమా డైలాగులు ఇలా అనేక రకాలుగా వీడియోలు తీసి స్నేహితులతో పంచుకుంటున్నారు. తొలుత సరదాగా కాలక్షేపం కోసం చూసే ఈ వీడియోలు చివరికి వ్యసనంలా మార్చేస్తున్నాయి. లైక్‌లు, కామెంట్ల కోసం చాలామంది రకరకాల వీడియాలు తీసి అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఎక్కువ లైక్‌ల కోసం అశ్లీలంగా మాట్లాడుతూ.. నృత్యాలు చేస్తున్నారు. వివాహితలు, పురుషులు ఇలాంటి వీడియాలు చేసి అప్‌లోడ్‌ చేయడంతో.. అవి వైరల్‌ అయి చివరికి భాగస్వామి వద్దకు చేరుతున్నాయి. దీంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి.                
– విజయనగరం మున్సిపాలిటీ

సాక్షి,విజయనగరం : ప్రస్తుతం చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న వారిలో చాలా మందికి టిక్‌ టాక్‌ యాప్‌ ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఒకటైన టిక్‌టాక్‌ యాప్‌ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. సమయం దొరికితే చాలు టిక్‌ టాక్‌ వీడియోలు చూడడం పరిపాటైంది. వీటిని చూస్తూ అనుకరించడం, పాటలు పాడడం వీడియోలు తీస్తూ పోస్టు చేయడం మితిమీరి పోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా అన్ని వర్గాల వారు టిక్‌టాక్‌ మోజులో పడి వీడియోలు చిత్రీకరిస్తూ పోస్టు చేస్తున్నారు. పోస్టులకు వచ్చే లైక్‌లు, కామెంట్స్‌ మోజులో పడి మాయా లోకంలో తేలిపోతున్నారు. ఈ క్రమంలో కొందరు ఎక్కువ లైక్‌లు, కామెంట్లు వస్తాయన్న ఆశతో సాహసాలు చేస్తూ కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడ్డ సందర్భాలున్నాయి. ఈ విష సంస్కృతి ఉద్యోగులకు సోకింది. ఉద్యోగులు విధి నిర్వహణ సమయంలోనూ టిక్‌టాక్‌ వీడియోలు చేసేస్తున్నారు. ఇటీవల కొందరు ఉద్యోగులు కార్యాలయాల్లో వీడియోలు చిత్రీకరించి టిక్‌ టాక్‌లో పోస్టులు చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఉద్యోగాలకే ఎసరొచ్చింది. 

మితిమీరితే అంతే సంగతులు
సామాజిక మాధ్యమాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. మొన్నటి వరకు ఫేస్‌బుక్‌ .. నేడు పబ్జి, హలో, టిక్‌ టాక్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిని ఆనందం పొందేందుకు కొంతమేర ఉపయోగిస్తే పర్వాలేదు మితిమీరితేనే ఇబ్బంది. ఒకరిని చూసి ఒకరు వీడియోలు చిత్రీకరిస్తూ లైకులు, కామెంట్ల కోసం టిక్‌టాక్‌లో పోస్టు చేస్తున్నారు. లైక్‌లు, కామెంట్లతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇలా వీడియోల చిత్రీకరణ మోజులో పడుతూ వీటికి బానిసలుగా మారుతున్నారు. ఎక్కడ ఖాళీ సమయం దొరికితే చాలు టిక్‌ టాక్‌ వీడియోలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో విచక్షణను కోల్పోయి విధి నిర్వహణలో ఉన్నా అన్నీ మరిచిపోయి ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకుంటున్నారు. కొందరు సాహసాలకు ఒడికట్టి మృత్యువాత పడుతున్నారు. ఇలా కుటు ంబాల్లో విషాదాన్ని నింపకుండా ఉండాలంటే వీటికి దూరంగా ఉండటమే మంచిది.

బాధ్యతగా వ్యవహరించాలి
ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. తనకు కేటాయించిన విధులపైనే దృష్టి సారించాలి. విధి నిర్వహణలో ఉండగా సామాజిక మాధ్యమాల జోలికి పోకూడదు. వీడియోలు చిత్రీకరించడం, చూడటం చేయకూడదు. ఒక వేళ చూడాలనిపిస్తే ఇంట్లో ఉన్నప్పుడు వీక్షించాలి. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై కన్నేసి ఉంచాలి. స్మార్ట్‌ ఫోన్‌ను దేనికోసం ఉపయోగిస్తున్నారు.. ఏవైనా ఉపయోగం లేని సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారా? అనే కోణంలో పరీక్షించాలి. ఒక వేళ ఉపయోగించినట్టు తేలితే.. వాటికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీటి వినియోగం సరదాగా మొదలై, ఒక్కొక్కసారి వ్యసనంగా మారొచ్చు. దీనివల్ల మానసిక రుగ్మతలకు దారి తీయవచ్ఛు.
– కె.నాగార్జున, సైకాలజిస్ట్, విజయనగరం.

కుటుంబాల్లో మనస్పర్థలు
గృహిణులు సైతం ఇంట్లో ఖాళీ సమయంలో టిక్‌ టాక్‌ వీడియోలు చేస్తున్నారు. ఇలా చేయడం మూలంగా వీక్షకుల నుంచి చెడు కామెంట్లను ఎదుర్కొనాల్సి వస్తుంది. దీంతో మానసిక క్షోభకు గురికాక తప్పడం లేదు.. ఒక్కొక్కసారి భర్తకు తెలియకుండా టిక్‌ టాక్‌లు చేయడం మూలంగా భార్య, భర్తల మధ్య వివాదాలు పొడచూపుతున్నాయి. క్రమేణా విడాకుల వరకు వెళ్తున్నాయి. కొందరు సినిమా పాటలకు నృత్యాలు చేస్తూ.. వీడియోలు చిత్రీకరిస్తూ కుటుంబ సభ్యులను భాగస్వాముల్ని చేస్తున్నారు. ఒక్కోసారి వావివరుసలు మరిచి పోయి డైలాగులు, నృత్యాలు చేస్తున్నా రు. ఇలా చేయ డం మూలంగా లైక్‌లు దేవుడెరుగు.. చెడు వ్యాఖ్యలు ఎక్కువగా వస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా జరిగిన కొన్ని సంఘటనలు
► బిహార్‌లో ఓ యువకుడు మిత్రులతో కలిసి వరదలో దూకుతూ టిక్‌ టాక్‌ వీడియో చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు వరద తాకిడికి మృత్యువాత పడ్డాడు.
► విశాఖపట్నంలో శక్తి టీం విధులు నిర్వహిస్తూనే టిక్‌ టాక్‌ వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌ అయ్యాయి. దీంతో వారిని యాజమాన్యం ఉద్యోగాల నుంచి తొలగించింది.
► గుజరాత్‌లో ఓ పోలీసు ఉద్యోగి ఖాకీ దుస్తుల్లోనే టిక్‌ టాక్‌ వీడియో చేయడంతో ఉద్యోగంపై వేటు పడింది.
► హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ విద్యార్థులు ఆసుపత్రిలోనే టిక్‌ టాక్‌ చేస్తూ పోస్టు చేయగా సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావడంతో సస్పెండయ్యారు.
► ఒడిశాలో ఆసుపత్రి పిల్లల వార్డులో అప్పుడే పుట్టిన పసిపాపతో నర్సులు చేసిన టిక్‌ టాక్‌ వీడియోలు బయటికి రావడంతో యాజమాన్యం వారిపై కొరడా ఝుళిపించింది.
► తమిళనాడులో ఓ మహిళ తన భర్త టిక్‌ టాక్‌లు చేయడానికి అంగీకరించ లేదని పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడింది.
► కరీంనగర్‌లోని వైద్యారోగ్య శాఖ జిల్లా కార్యాలయంలో పని చేస్తున్న ముగ్గురు మహిళలు విధులు విస్మరించి టిక్‌ టాక్‌ వీడియోలు చిత్రీకరించి పోస్టు చేశారు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో జిల్లా పాలనాధికారి ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top