కన్నతల్లిని గెంటేశాడు
పోలీస్స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదు
ఐలవరం(భట్టిప్రోలు): నవ మాసాలు మోసి కని పెంచిన కన్నతల్లికి వృద్ధాప్యంలో ఆదరువుగా ఉండాల్సిన కొడుకు ఆస్తి కోసం బయటకు గెంటేసిన ఘటన భట్టిప్రోలులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... ఐలవరం గ్రామానికి చెందిన పడవల సామ్రాజ్యం భర్త ఏడాది కిందట మృతి చెండాడు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సాంబశివరావు బెంగుళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు మంగళగిరిలో ఉంటూ విజయవాడలోని ప్రింటింగ్ ప్రెస్లో పని చేస్తున్నాడు.
సామ్రాజ్యం వచ్చే కొద్దిపాటి పింఛన్ డబ్బుతో పొట్ట నింపుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె పెద్ద కుమారుడు, కోడలు రెండు రోజుల కిందట ఐలవరం వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఇంటి స్థలం కాగితాలు ఇవ్వాలని ఆమెను సతాయిస్తున్నారు. దీంతో ఆమె ఇచ్చే ప్రసక్తి లేదని, నా తదనంతరం అన్నదమ్ములిద్దరికీ చెందుతుందని తెగేసి చెప్పింది. ఆగ్రహించిన కొడుకు తల్లి అని కూడా చూడకుండా బయటకు గెంటి వేసి సామాన్లు, బట్టలు రోడ్డుపై పడేశాడు. దీంతో ఏమి చేయాలో పాలుపోక తన రెండో కుమారుడు శ్రీనివాసరావుకు కబురు పంంపింది. శుక్రవారం శ్రీనివాసరావు సహాయంతో సామ్రాజ్యం భట్టిప్రోలు పోలీస్స్టేషన్లో ఆమె పెద్ద కుమారుడిపై ఫిర్యాదు చేసింది.