అర్హత ఉన్నా పింఛన్ లేదన్నా..
శ్రీకాకుళం: వితంతు పింఛనుకు అర్హత ఉన్నా పథకం వర్తింపజేయడం లేదు. ఏడాదిగా అధికారులకు దరఖాస్తు చేసుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కుటుంబ పోషణ కష్టంగా మారింది. రోజుకూలీ డబ్బులు సరిపోవడం లేదు. పింఛన్ మంజూరు చేసేలా ఆదుకోవాలన్నా..– కుప్పిలి రాజేశ్వరి, బగ్గు లక్ష్మి, బలిజిపేట,ఎచ్చెర్ల మండలం
వైద్యం అందక ఇబ్బందులు
అత్యవసర పరిస్థితిలో వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా పంచాయతీ పరిధిలో ఐదు అనుబంధ గ్రామాల ప్రజలు వైద్యసేవల కోసం శ్రీకాకుళం, ఎచ్చెర్ల వెళ్లాల్సి వస్తోంది. మా ప్రాంతంలో పీహెచ్సీ ఏర్పాటు చేయాలి. నారాయణపురం కుడికాలువ నీరు రాక దాదాపు రెండు వేల ఎకరాల్లో పంట భూములుగా బీడుగా మారుతున్నాయి. సమీపంలో ఫ్యాక్టరీలున్నా స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం లేదు.
– ముద్దాడ శంకర్, ముద్దాడ గ్రామం, ఎచ్చెమండలం
బంగారు తల్లి పథకం వర్తింపజేయాలి
ఆడపిల్లలకు సంబంధించి ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకం వర్తింపజేయడం లేదు. మాది నిరుపేద కుటుంబం. గ్రామంలో నాయకులు గానీ, అధికారులు గానీ మా సమస్యను పట్టించుకోవడం లేదు. ఆడపిల్ల ఉంటే బంగారుతల్లి పథకం వర్తిస్తుందని టీడీపీ ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి ఆశపడ్డాం. ఆ ఆశ అడియాసే అయ్యింది. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక మాలాంటి తల్లులకు అండగా నిలవాలి. – నిమ్మల దుర్గమ్మ, కుప్పిలి