బియ్యం స్మగ్లర్ల గుట్టురట్టు


పలమనేరు: రెండు నెలలుగా జిల్లాలో సాగుతున్న బియ్యం అక్రమ రవాణా గట్టును పలమనేరు పోలీసులు విప్పారు. శ్రీకాళహస్తి కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సాగుతున్నట్లు  విచారణలో తేలింది. దీనికి సంబంధించి ఏడుగురు స్మగ్లర్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేట్‌కు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను పలమనేరు సీఐ బాలయ్య విలేకరులకు వివరించారు.



ఈ నెల 12న ‘నల్లబజారుకు తెల్లబియ్యం’ శీర్షికన సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితమైన విషయం తెల్సిందే. దీనిపై ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ స్పందిం చారు. జిల్లాలోని పోలీసులను అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పలమనేరు పోలీసులు పట్టణంలోని అపోలో ఫార్మసి ఎదురుగా ఓ బియ్యం లారీని పట్టుకున్నారు. ఆ లారీ డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతనిచ్చిన సమాచారంతో తీగ లాగితే డొంక కదిలింది.

 

శ్రీకాళహస్తి నుంచే రవాణా..



శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు వ్యక్తులతో పాటు వి.కోటకు చెందిన  ఒకరు తమిళనాడు బియ్యంతో పాటు జిల్లా నుంచి అందే బియ్యాన్ని డంప్‌చేసి బంగారుపేట్‌కు తరలించేవారు. పక్కా సమాచారం తో పలమనేరు పోలీసులు పెద్దిరాజు (36), బాలాజీ (36), తాజుద్దీన్ (32), పఠాన్‌బాబు (39), బాలమురుగన్ అలియాస్ బాల (20), వినోద్‌ను పట్టుకున్నారు. వీరందరూ శ్రీకాళహస్తికి చెందిన వారే.



జీడీ నెల్లూరు మండలం ఎట్టేరికి చెందిన పెద్దిరాజు శ్రీకాళహస్తి కేంద్రంగా ఈ ముఠాకు బాస్. వీరితో పాటు వి.కోటకు చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్ ఆండియప్పన్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై తమిళనాడు రాష్ర్టంలోనూ పలు కేసులున్నాయి. ఆండియప్పన్‌పై తమిళనాడు ప్రభుత్వం అవార్డును సైతం ప్రకటించింది. వీరందరిపై కేసులు నమోదుచేసి పలమనేరు కోర్టుకు తరలించారు.

 

బియ్యం ఎలా సేకరిస్తారంటే..




శ్రీకాళహస్తి కేంద్రంగా బియ్యాన్ని కర్ణాటకకు తరలించేది పెద్దిరాజు ముఠా. తమిళనాడుకు చెందిన భాస్కర్‌రెడ్డి, హరినాథరెడ్డి, ప్రభాకర్, ధన్‌రాజ్ తమిళనాడులో బియ్యాన్ని సేకరించి నెల్లూరు జిల్లాలోని తడ వద్దకు చేరుస్తారు. అలాగే చిత్తూరు జిల్లాలో సేకరించిన బియ్యాన్ని పలుచోట్ల డంప్‌లుగాచేసి ఈ రెండింటినీ కలిపి పెద్దిరాజు గ్యాంగ్‌కు విక్రయిస్తారు.

 

ఈ బియ్యమంతా బంగారుపేట్‌కే



తమిళనాడు రాష్ర్టంలో భాస్కర్‌రెడ్డి గ్యాంగ్ అక్కడి బియ్యాన్ని చౌకగా కొనుగోలు చేసి ఇక్కడి స్మగ్లర్లకు రూ.10 లెక్కన విక్రయిస్తుంది. వీరు ఈ బియ్యాన్ని జిల్లాలో దొరికే చౌకబియ్యంతో కలిపి కర్ణాటకలోని బంగారుపేటలో పాలిషింగ్ యాజమానులు బాయ్, మురుగన్‌లకు రూ.15 నుంచి 20లకు విక్రయిస్తారు. ఆ బియ్యాన్ని కిలో రూ.30 దాకా ప్రజలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం మీద ఈ ముఠాకు పలమనేరు పోలీసులు చెక్ పెట్టారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్‌ఐ శ్రీరాముడు, సిబ్బంది దేవరాజులును సీఐ అభినందించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top