పీఆర్‌ ఇంజినీరు హవా

తానే ప్రజాప్రతినిధినంటూ బిల్డప్‌

చిరుద్యోగుల మధ్య చిచ్చుపెడుతున్న వైనం

కాంట్రాక్టర్ల నిలువుదోపిడీ!

కొమ్ముకాస్తున్న పోలీసులు, ప్రజాప్రతినిధులు

నియోజకవర్గ ప్రజాప్రతినిధి తరహాలోనే తెల్ల దుస్తులు ధరిస్తారు. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే అదురూబెదురూ లేకుండా తానే ప్రజాప్రతినిధిని అంటారు. కింది ఉద్యోగులనే కాదు, పై అధికారిని కూడా ‘నాకు చెప్పకుండా ఎందుకొచ్చారు.. ఎలా ఉంటారిక్కడ?’ అని ప్రశ్నిస్తారు.     అమాయక కాంట్రాక్టర్లను నిలువుదోపిడీ చేస్తారు. ఆయనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా రాజీ ప్రయత్నాలకు రంగంలోకి దిగిపోతుంటారు. తెనాలి పంచాయతీరాజ్‌ ఈఈ కార్యాలయంలో ఓ సీనియర్‌ ఇంజినీరు హవా ఇది.

తెనాలి: స్థానిక పంచాయతీరాజ్‌ ఈఈ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్‌ అసిస్టెంటు వీరాస్వామి, జూనియర్‌ అసిస్టెంట్‌ రాంబాబును సస్పెండ్‌ చేస్తూ జిల్లా పరిషత్‌ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పంచాయతీరాజ్‌ ఈఈ కార్యాలయంలో ఏడాదిగా నడుస్తున్న ఉద్యోగుల ఆధిపత్య పోరులో ఉన్నతాధికారులు ఇప్పటికి క్రమశిక్షణ కత్తి దూసినట్టయింది. ఒకరిపై ఒకరు 1100 నంబరుకు, సీఎం కార్యాలయానికి చేసిన ఆధారపూరిత ఫిర్యాదుల నేపథ్యం ఇందుకు దారి తీసింది. ఆ క్రమశిక్షణ వేటు సీనియర్‌ ఇంజినీరుపై పడుతుందా? అధికారపక్ష నేతల ప్రమేయంతో నీరుగారుతుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అధికారానికి మడుగులొత్తుతూ..
కాంగ్రెస్, తెలుగుదేశం...ఏ పార్టీ అధికారంలో ఉన్నా, స్థానిక ప్రజాప్రతినిధులకు నమ్మినబంటుగా వ్యవహరిస్తూ, తోటి ఉద్యోగులు, కాంట్రాక్టర్లపై స్వారీ చేస్తుంటారా సీనియర్‌ ఇంజినీరు. చిన్న టీఏ బిల్లు దగ్గర వివాదంలో ఒకరిపై ఒకరిని రెచ్చగొట్టిన ఫలితంగా రేగిన చిచ్చు, రగులుకుంటూ తాజా సస్పెన్షన్ల వరకూ వెళ్లింది. చిరుద్యోగి ఒకరు తోటి ఉద్యోగిపై అట్రాసిటీ ఫిర్యాదు కూడా చేశారు. విచారణలో అది బోగస్‌గా తేలింది. అక్కడదాకా ఉద్యోగులు తెగించారు. కార్యాలయానికి రాకుండానే జీతాలు ఆరగిస్తున్న అరాచకానికీ దిగారు. సాక్ష్యాధారాలతో ఫిర్యాదులు చేసుకోవటంతో దొరికిపోయారు. ఇందులో సదరు సీనియర్‌ ఇంజినీరుపైనా ఆరోపణలున్నాయి.  

కాంట్రాక్టర్ల నోట్లో మట్టి
ఒక కాంట్రాక్టరుకు వర్క్‌ఆర్డరు ఇవ్వటంతోనే విలువైన పనులు కట్టబెడతానని ఆశచూపి, డబ్బులు దండుకోవటం ఆ ఇంజినీరు నైజం. సిమెంటు ఇతరత్రా తక్కువ ధరకు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుంటాడు. సిమెంటు తెప్పించకుండానే పనులు చేయాలని సతాయిస్తాడు. అదేమంటే బూతుల పంచాంగం ఎత్తుతాడు. అప్పోసొప్పో చేసి, శ్లాబు వేశాక, వేరొకరి పేరుతో వర్క్‌ఆర్డరు తయారు చేయించి, మరో బినామీని రంగంలోకి దించుతాడు. మొత్తం బిల్లును ఆ పేరుతో వచ్చేలా చేస్తాడు. పనులు చేసిన కాంట్రాక్టరు నోట్లో మట్టి కొడతాడు. ఇందుకు పలు ఉదాహరణలున్నాయి. ఇక్కడ పని చేసిన ఉన్నతాధికారులు ఎవరూ ఇతడికి ఎదురుచెప్పరు. ఎదురు తిరిగిన కాంట్రాక్టరును ఇలా శంకరగిరి మాన్యాలు పట్టిస్తాడు. ఇలాంటి వ్యవహారాలతో ఓ కాంట్రాక్టరుకు కడుపు మండిపోయింది. డబ్బుపోయి శనిపట్టినట్టు తిట్టారన్న ఆవేదనతో వర్క్‌ఆర్డరు మోసంపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. బూతుల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీనియర్‌ ఇంజినీరు అంటే మాటలు కాదు కదా! రెండు నెలల తర్వాత తీరిగ్గా ఎఫ్‌ఐఆర్‌ కట్టారు. మరో రెండు నెలల తర్వాత కొత్త డీఎస్పీ వచ్చాక గత వారం చార్జిషీటు వేశారట!

రాజీ పంచాయితీ
ఈలోగా సదరు కేసులో రాజీకి పట్టణానికి చెందిన ఓ కౌన్సిలరు దగ్గర పంచాయితీ పెట్టారు. ఇద్దరు టీడీపీ ఎంపీపీలు రంగంలోకి దిగారు. ఒక ఎంపీపీ నేరుగా కాంట్రాక్టరు ఇంటికి తన కారులో వెళ్లారు మరి!. కాంట్రాక్టరు నుంచి కొట్టేసిన రూ.2 లక్షలు ఇంజినీరు ఇచ్చేలా, కాంట్రాక్టరు కేసు వాపసు తీసుకొనేలా ఒప్పందం చేశారు. డబ్బు ఇవ్వకుండానే కేసు వాపసు కోసం ఒత్తిడి చేశారు. రూరల్‌లో ఉండే టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకుడొకరు తన వంతు ప్రయత్నం చేశారు. మరో మండల పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ, ఆ కాంట్రాక్టరును బెదిరించి, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొనేందుకు ఒత్తిడి చేశాడు. ప్రజాప్రతినిధుల అండ ఉందన్న భీతితో పీఆర్‌ అధికారులు ఆ ఇంజినీరుకు అడ్డుచెప్పరు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయలేరు. ఇక చిరుద్యోగులు, కాంట్రాక్టర్లు ఏం చేయగలరు?. ఉన్నతాధికారుల దృష్టికి అతడి వ్యవహారం వెళ్లినందున పూర్తిస్థాయిలో విచారణ చేస్తే విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడవుతాయని అంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top