చదవలేక పోతున్నాం
పాఠశాల సమస్యలను జగన్ వద్ద ఏకరువు పెట్టిన విద్యార్థినులు
పత్తికొండ రూరల్: వర్షమొస్తే పాఠశాల ప్రాంగణంలో నీరు నిలుస్తోందని, పైకప్పు ఉరుస్తుండటంతో తరగతి గదులు తడిచిపోతున్నాయని ఆళ్లగడ్డ మండలం పెద్దచింతకుంటలోని ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట తమ ఇబ్బందులను ఏకరువు పెట్టారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవని వాపోయారు. ఆ పాఠశాల విద్యార్థినులు ఆశ, జ్యోతి, శాంభవి, మల్లీశ్వరి, పూజిత, నాగాంజలి, ఉశేని, షమీన గురువారం పెద్దచింతకుంట గ్రామంలో ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్తో మాట్లాడారు.
తమ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 600 మంది చదువుకుంటున్నట్లు చెప్పారు. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయని, చెత్తాచెదారంతో పాఠశాల పరిసరాలు అధ్వానంగా మారిపోయాయని ఆయన దృష్టికి తెచ్చారు. ఇన్ని సమస్యల నడుమ తమ చదువులు సక్రమంగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ స్పందిస్తూ.. ఈ సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. మీరు బాగా చదువుకోవాలని సూచించారు.