మాఫియా పన్నాగం

Sand Mafia in Kurnool - Sakshi

జత కట్టి  ఇసుక దందా

ముందుండి వ్యూహం పన్నిన టీడీపీ నేత   

అధికారులకు మామూళ్లు

ఇసుక మాఫియా పెట్రేగిపోతోంది. జట్టుగా ఏర్పడి తుంగభద్ర నదిలో ఇసుక  కొల్లగొట్టేస్తోంది. టీడీపీ నేత ‘పన్నాగ’ం తో సరికొత్త సంస్కృతికి తెరతీశారు. రెవెన్యూ.. పోలీస్‌స్టేషన్‌.. పాత్రికేయులకు మామూళ్లు కొట్టి నోళ్లు మూయించారు. అధికారులను కళ్లున్న కబోదులను చేసి  ఇసుక అక్రమ రవాణాకు బాటలు వేసుకున్నారు. పగలూ రాత్రి  రయ్యిరయ్యి మంటూ ఇసుక ట్రాక్టర్ల మోతమోగిస్తున్నారు.   

కర్నూలు , మంత్రాలయం: తుంగభద్ర నది ఇసుకకు ప్రధాన వనరు. నది పొడవునా మంత్రాలయం, చెట్నెహళ్లి, మాధవరం, కాచాపురం, రాంపురం గ్రామాలు ఉన్నాయి. సరైనా పరిమాణంలో ఇసుక లేకపోవడంతో ప్రభుత్వం ఇసుక రీచ్‌ ఏర్పాటు చేయలేదు. ఇదే అదునుగా చేసుకున్న టీడీపీ నేతలు ఇసుక అక్రమ తరలింపునకు కొత్తగా జత కట్టారు. మంత్రాలయం కేంద్రంగా ఇసుకను తరలించేందుకు ప్రణాళిక రచించారు. ఇసుక తరలింపు మాఫియా ఓ చోట సమావేశమై మామూళ్ల కథను బయటకు తెచ్చారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు, పాత్రికేయులు నోళ్లు మూయించేందుకు వాటాల వేడుక తెచ్చారు. 

పన్నిన ‘పన్నాగ’ం :ఇసుక మాఫియా వ్యూహ రచనలో టీడీపీ మండల అధ్యక్షుడు పన్నగ వెంకటేష్‌ ప్రధాన భూమిక పోషించినట్లు సమాచారం. ఇంట్లో మాఫియాతో సమావేశమై వాటాల బాగోతం తెరపైకి తెచ్చారు. ఇసుక ట్రాక్టర్‌కు నెలకు రూ.3 వేలు చొప్పున చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. జమ చేసిన నగదును మూడు భాగాలుగా విభజించి వాటాలు పంచేలా నిర్ణయించారు. రెండు నెలలుగా ఈ తంతు సాగుతూ వస్తోంది. పన్నగ వెంకటేష్‌ రెండు శాఖల అధికారులతో సంప్రదించి అక్రమ రవాణాకు గ్రీన్‌సిగ్నల్‌ పలికారు అన్నది బహిరంగ రహస్యం. అధికార దర్పంతో మాఫియా అంతా ఏకమై వాటాల పర్వం సాగిస్తోంది. మంత్రాలయం మండలం, పరిసర గ్రామాలకు చెందినవి 30 ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్ల నెల వసూలు రూ.90 వేలు. అందులో రెవెన్యూ శాఖకు రూ.30, పోలీస్‌స్టేషన్‌కు రూ.30, పాత్రికేయులకు రూ.30 వేలు చొప్పున వాటాలుగా ముట్టజెప్పుతున్నారు. ఈ వ్యూహంలో కల్లుదేవకుంట ట్రాక్టర్‌ యజమానులు సైతం కీలకపాత్ర పోషించారు. 

అక్రమ తరలింపుతో ఆదా..   
స్థానిక ఇసుకను ప్రధానంగా ఎమ్మిగనూరు పట్టణానికి తరలిస్తున్నారు. మంత్రాలయం కేంద్రంలో ఇసుక ట్రాక్టర్‌ రూ.1200 చొప్పున విక్రయిస్తున్నారు. ఎమ్మిగనూరు రూ.3–4 వేలుకు టిప్పు అమ్ముకుంటూ అక్రమార్జన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల్లేకున్నా మాఫియా సంపాదన మాత్రం రూ.కోట్లు మించిపోవడం విశేషం. 

చట్టానికి తూట్లు
వాల్టా చట్ట ప్రకారం విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు, చెట్లు నరికి వేయడం చేయరాదు. ప్రభుత్వ అనుమతులతోనే తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టాలి. చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారులే కాసులకు దాసోహమయ్యారు. వాటాలతో సరిపెట్టుకుని దాడులకు చెల్లుచీటి ఇచ్చారు. కళ్లేదుట, కార్యాలయాల ఎదుట వందల కొద్దీ ట్రాక్టర్లలో ఇసుక తరలుతున్నా పట్టించుకోవడం లేదు.  టీడీపీ నేత ‘పన్నాగ’ంలో అధికారులు పావులుగా మారడం విచారకరం. మాఫియా వ్యూహాన్ని చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇసుక దందాపై నిట్టూరుస్తున్నారు. సామాన్యులు ఇసుక కోసం నానా అవస్థలు పడుతుంటే.. ఇసుక మాఫియాకు మాత్రం దారులు సుగమం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్త మవుతున్నాయి. 

అనుమతుల్లేవు
ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతుల్లేవు. అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నెలనెలా రూ.30 వేలు ముట్టజెప్పుతున్నారన్న ఆరోపణలు అవాస్తవం. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం కట్టుబడి పనిచేస్తాం. ఎవరైనా ఇసుకను తరలిస్తే కేసులు బనాయిస్తాం.    జె.రుద్రగౌడ్, తహసీల్దార్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top