'మానిటరింగ్‌ వ్యవస్థ బలోపేతం చేస్తాం'

Sakshi interview With RJD Venkatramiredy In Anantapur

ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి

సాక్షి, చిత్తూరు : సాధారణ, మధ్యతరగతి, పేద కుటుంబాల పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. అలాంటి పిల్లలకు నాణ్యమైన విద్యనందించి ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నదే ప్రధాన అజెండగా ప్రతి ఒక్కరూ భావించాలి. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాల సాధనకు చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్ర స్థాయిలో పాఠశాలల మానిటరింగ్‌ వ్యవస్థను సరిదిద్దేందుకు చర్యలు చేపడుతాం. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాం’ అని వైఎస్సార్‌ కడప ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నైపుణ్యస్థాయిని పెంపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని వెల్లడించారు. బుధవారం చిత్తూరుకు విచ్చేసిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

పాఠశాలలపై ఎంఈఓ, డీవైఈఓల పర్యవేక్షణ కొరవడుతోంది.?
జవాబు : పాఠశాలలపై మానిటరింగ్‌(పర్యవేక్షణ) కొరవడింది వాస్తవమే. ఎంఈఓ, డీవైఈఓ, డీఈ ఓలు క్షేత్రస్థాయిలో మానిటరింగ్‌ చేస్తే మంచి ఫలి తాలుంటాయి. ప్రార్థన సమయానికి హాజరైతే మార్పు కచ్చితంగా వస్తుంది. మధ్యాహ్న భోజన సమయంలో ఒక స్కూల్‌ను తనిఖీ చేయాలి. మాని టరింగ్‌ వ్యవస్థ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. మార్పు తీసుకువస్తాం. 

నెలవారీ పదోన్నతులు, విరమణలతో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడుతున్నాయి? 
జవాబు : గతంలో రేషనలైజేషన్‌ సరిగ్గా నిర్వహించలేదు. ఖాళీల భర్తీ కోసం అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు కావాలని ప్రభుత్వానికి నివేదికలు పంపాం. అనుమతులు రాగానే పోస్టులను భర్తీ చేస్తాం. డీఎస్సీ పోస్టుల భర్తీ కూడా త్వరలో పూర్తవుతుంది. 
 
పర్యవేక్షణకు ఎంఈఓలు వాహన సౌకర్యం కావాలంటున్నారు?
జవాబు : టీఏ ఇస్తున్నాం. వాహనం విషయం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. 

అభ్యసన స్థాయి పెంచేందుకు తీసుకుం టున్న చర్యలు ?
జవాబు : అభ్యసన ఫలితాలు గతంలో పోలిస్తే ప్రస్తుతం భాగానే ఉన్నాయి. 17వ స్థానంలో ఉండేవాళ్లం, ప్రస్తుతం జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఉన్నాం. నైపుణ్యాలు మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. ఎంఈఓలు, టీచర్లు నిబద్ధతతో పనిచేయాలి.   
 
హైస్కూల్‌ హెచ్‌ఎంలు పాఠాలు చెప్పడం లేదు? సమాచారానికే పరిమితం అవుతున్నారు?  
జవాబు :పాఠశాలలకు హెచ్‌ఎంలే రియల్‌ హీరోలు. ప్రతి హెచ్‌ఎం కచ్చితంగా పాఠాలు చెప్పాల్సిందే. ఆదేశాలు జారీ చేస్తాం.

ఎంఈఓల నిధుల దుర్వినియోగంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జవాబు :విధుల విషయంలో కచ్చితంగా ఉంటాం. పనితీరు బాగాలేకుంటే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఇటీవల ఆరోపణలు రావడంతో ఒకరిని సస్పెండ్‌ చేశాం.   

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏర్పేడు ఎం ఈఓకు తిరుపతి రూరల్, అర్బన్‌ మండలాలను అదనంగా అప్పజెప్పారు? 
జవాబు : ఒకే ఎంఈఓకు మూడు పోస్టులు విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే అదనపు బాధ్యతల  నుంచి తొలగించాం.

రాబోయే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఎలాంటి మార్పులు తీసుకురానున్నారు?
జవాబు : పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. గత విద్యాసంవత్సరం పదోతరగతి పరీక్ష ప్రశ్న పత్రాల విధానంలో మార్పులు జరిగాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఇంకా పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించలేదు. 

కోర్టు కేసుల వారికి, గతంలో వద్దని రెండు సార్లు రాసిచ్చిన వారికి పదోన్నతులు ఇచ్చారు?
జవాబు : దీనిపై ప్రత్యేకంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం 

పదోన్నతుల సీనియారిటీ జాబితాలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి?  
జవాబు : డీఎస్సీల వారీగా జాబితాలు సిద్ధం చేస్తాం. వెబ్‌సైట్‌లో జాబితాలు నమోదు చేయించి, అభ్యంతరాలకు అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. సీనియారిటీ జాబితాలు పక్కాగా తయారు చేయిస్తాం.

జియో ట్యాగింగ్‌తో పర్యవేక్షణ విధానాన్ని మారుస్తారా? 
జవాబు :  జియో ట్యాగింగ్‌లో ఎంఈఓ, హెచ్‌ఎం లు, డీవైఈఓలు, టీచర్లు ఉంటారు. ప్రొసీడింగ్స్‌ వెంటనే వెళుతాయి. టీచర్లు చేపట్టే కార్యక్రమాలు కూడా అందులో పెట్టవచ్చు.  అనంతపురం, కర్నూలులో ఆ విధానం అమలులో ఉంది. చిత్తూరు, వైఎస్సార్‌ కడపలో త్వరలో అమలుచేస్తాం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top