సబ్ రిజిస్ట్రార్ అక్రమాస్తులు 25 కోట్లు
గాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకయ్యనాయుడుపై ఏసీబీ కొరడా
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంగాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకయ్యనాయుడు అక్రమాస్తులపై ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ కొరడా ఝుళిపించింది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టాడన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాల మేరకు విశాఖ, తిరుపతి, తూర్పుగోదావరి జిల్లాల్లోని పది ప్రాంతాల్లో డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో అధికారులు సబ్ రిజిస్ట్రార్ నివాసంతో పాటు అతని బంధువులు, బినామీల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు.
కీలకమైన డాక్యుమెంట్లతో పాటు స్థిర, చరాస్థులు బయటపడ్డాయి. వీటి విలువ రిజిస్ట్రేషన్ లెక్కల ప్రకారం రూ.6 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మార్కెట్ రేటు ప్రకారం రూ.25 కోట్లు పైమాటేనంటున్నారు. తాజా సోదాల అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.