శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గిన వరద
సాక్షి, శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఎగువ ప్రాంతాలైన జూరాల, రోజా గేజింగ్ పాయింట్ నుంచి 60,923 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరింది. ప్రాజెక్టు వద్దనున్న భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఒక జనరేటర్తో ఉత్పత్తి చేస్తూ దిగువనున్న నాగార్జున సాగర్కు 7,416 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరి ద్వారా 10,000 క్యూసెక్కులు, హంద్రీ-నీవా సుజల స్రవంతికి 2,025 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మంగళవారం నుంచి బుధవారం వరకు రెండు జలవిద్యుత్ కేంద్రాలలో 5.604 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి.. నాగార్జున సాగర్కు 10,215 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 191.2118 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటి మట్టం 880.60 అడుగులకు చేరుకుంది.