చారిత్రక కట్టడాన్ని కూల్చేస్తున్నారు..
ఎస్ఎంఎస్ నాయకుల ఆవేదన
తూర్పుగోదావరి ,కపిలేశ్వరపురం (మండపేట): పెద్దాపురంలో 111 ఏళ్ళ చరిత్ర గల ఆర్డీఓ కార్యాలయాన్ని కూల్చేస్తున్నారంటూ పాదయాత్రలో అచ్చంపేట వద్ద జగన్ వద్ద సోషల్ మీడియా ఫర్ సొసైటీ (ఎస్ఎంఎస్) జిల్లా నాయకులు వంగలపూడి శివకృష్ణ, దారపురెడ్డి క్రాంతికుమార్, ముక్తార్ ఆలీ, కొల్లి దుర్గాప్రసాద్, సరెళ్ళ ప్రవీణ్, ఇమ్మానియేల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రక కట్టడాన్ని తొలగించకుండా సమీపంలోని ఖాళీ ప్రదేశంలో నూతన భవనాన్ని నిర్మించాలని తాము చేసిన సూచనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.
తాము గతంలో పలు మార్లు ఆందోళనలు చేసిన ఫలితంగా నూతన భవనన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాత భవనాన్ని యథావిధిగా ఉంచి నూతన భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇటీవల హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మున్సిపల్ చైర్మన్ల ప్రోద్బలంతో రాత్రి వేళ చారిత్రక కట్టడంలోని ఓ భాగాన్ని తొలగించి మాట తప్పారన్నారు. ఆర్డీఓ భవనాన్ని 1907లో నిర్మించారని, భద్రాచలం, రంపచోడవరం డివిజన్లలోని పలు రెవెన్యూ విభాగాల పర్యవేక్షణ గతంలో ఈ కార్యాలయం నుంచే సాగేదన్నారు. నూతన భవనానికి కేవలం 9 వేల చదరపు గజాలు మాత్రమే చాలని, సమీపంలో 20 వేల చదరపు గజాలు భూమి ఉన్నదని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేలా చూడాలన్నా అంటూ జగన్ను కోరారు.
సంబంధిత వార్తలు