ప్రసవ వేదన.. అరణ్య రోదన
తూర్పుగోదావరి, మారేడుమిల్లి (రంపచోడవరం): ప్రభుత్వాలు మారి నా గిరిజన గ్రామాలకు కనీస అవసరాలు సమకూరడం లేదు. అత్యవసర వైద్యం అవసరమైతే ఆసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్సూ ఉండదు. సరైన రో డ్లూ ఉండవు. మండలంలోని పుల్లంగా పంచాయతీ పరిధిలో చోటుచేసుకున్న ఘటన ఇందుకొక ఉదాహరణ. ఈ పంచాయతీ పరిధిలోని పూసివాడ గ్రామానికి చెందిన కలుముల ఎర్రమ్మ అనే ఎనిమిది నెలల గర్భిణికి బుధవారం ఫిట్స్ వచ్చి, అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే బంధువులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు.
అయితే అంబులెన్స్ ఆందుబాటులో లేదు. గత్యంతరం లేకపోవడంతో గ్రామానికి చెందిన యువకుల సహాయంతో ఆ గర్భిణిని మంచంపై పడుకోబెట్టి సుమారు ఐదు కిలోమీటర్ల దూరం మోసుకుంటూ అతికష్టం మీద కొంతదూరం తీసుకు వచ్చారు. వర్షానికి మార్గం మధ్యలోని కొండ కాలువ పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదం అని తెలిసినప్పటికీ, మరో మార్గం లేకపోవడంతో గర్భిణిని కొండవాగు దాటించి, చివరకు చెలక వీధి వరకూ తీసుకు వచ్చారు. అక్కడి నుంచి ఆటోలో బోదులూరు పీహెచ్సీకి తీసుకు వస్తుండగా గుర్తేడు మెడికల్ క్యాంపునకు వెళ్లి వస్తున్న అంబులెన్స్ ఎదురు పడింది. ఆమెను ఆ అంబులెన్స్లో మారేడుమిల్లి పీహెచ్సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్య సేవల కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.