11వ రోజు ముగిసిన పాదయాత్ర
సాక్షి, కర్నూల్ : జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పదకొండో రోజు ముగిసింది. దొర్నిపాడు, కంపళ్లమెట్ట, కోవెలకుంట్ల మీదుగా కొనసాగిన యాత్ర చివరకు కర్రా సుబ్బారెడ్డి విగ్రహాం వద్దకు చేరుకోగానే పూర్తయ్యింది. వైఎస్ జగన్ 11వ రోజు 16.5 కిలోమీటర్లు నడిచారు.
పాదయాత్ర సాగిందిలా... దొర్నిపాడు వద్ద పెద్ద ఎత్తున మహిళా వ్యవసాయ కూలీలు ఆయనను కలిశారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి బాధలు విన్న ప్రతిపక్షనేత ....రుణమాఫీ, పిల్లల చదువులపై భరోసా కల్పించారు. అలాగే దొర్నిపాడు శివారులో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. కంపమెళ్లమెట్ట చేసుకున్న వైఎస్ జగన్నకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ ఆయన్ని కలిసిన మహిళా రైతు కూలీలు తమ సమస్యలను జగనన్నకు విన్నవించుకున్నారు. రోజువారీ కూలీ, రుణమాఫీ అందట్లేదన్న వారి గోడు విన్న ఆయన.. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆపై రైతు సంఘాల ప్రతినిధులు ఆయన్ని కలిసి రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులపై నివేదిక సమర్పించారు. దీనిపై నీటిపారుదల నిపుణులతో చర్చిస్తామని జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఇక టీడీపీ జిల్లా డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు రామిరెడ్డి, మరో కొందరు టీడీపీ నేతలు జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.
ఆపై బనగానపల్లె నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ క్రాస్ రోడ్, భీమునిపాడు, పెరా బిల్డింగ్స్, మీదుగా కోవెలకుంట్లకు చేరుకోగా.. అక్కడా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా రజకులు, తమను ఎస్సీలో చేర్చాలని వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ నేత పేరా రామసుబ్బారెడ్డి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం కొనసాగిన పాదయాత్ర చివరకు కర్రా సుబ్బారెడ్డి విగ్రహం వద్దకు చేరుకోగానే ముగిసింది. అక్కడే ఆయన రాత్రి బస చేయనున్నారు. ఇప్పటికి వైఎస్ జగన్ మొత్తంగా 154 కిలోమీటర్లు నడిచారు.