సాగునీటి కోసం పోరుబాట

సాగునీటి కోసం పోరుబాట


పాలకులు, అధికార యంత్రాంగం పక్షపాతం, నిర్లక్ష్యం కారణంగా కావలి కాలువ ఆయకట్టు భూములు బీళ్లుగా మారాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పొలాలు సాగునీరందక కళ్ల ముందే ఎండిపోతుండటంతో కడుపు మండుతున్న రైతులు ఒక్కటవుతున్నారు. సాగునీటి కోసం అధికార యంత్రాంగపై సమరానికి సిద్ధమవుతున్నారు. ఒకే వేదికగా సాగునీటి ఉద్యమానికి ప్రణాళిక సిద్ధమవుతోంది.

 

కావలి :  సోమశిల జలాశయంలో పుష్కలంగా నీరున్నా.. కావలి కాలువ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయడంలో అధికారులు  మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఐఏబీ సమావేశంలో కాలువ ఆయకట్టు కింద 75 వేల ఎకరాలకు సాగునీరందిస్తామని అధికారులు, పాలకులు ప్రకటించారు. ఆ మేరకు రైతులు సాగు చేపట్టారు. తీరా ఇప్పుడు అంత ఇవ్వలేం..ఇంతవ్వలేమంటూ రైతులను నష్టాలపాల్జేసి అప్పులు ఊబిలోకి నెట్టారు.



ఇప్పటికే సుమారు 50 వేల ఎకరాలు సాగు చేయకుండా వదిలేస్తే.. మరో 40 వేల ఎకరాల్లో నాటిన నాట్లు, వెన్నుదశలోని పైరు ఎండిపోతున్నాయి. ఇప్పటి వరకు సహనంగా ఎదురు చూసిన రైతాంగం కదం తొక్కనుంది. అన్నదాత పక్షాన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి  ఆమరణ దీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే దీక్షకు రాజకీయాలకతీతంగా రైతులు, ప్రజల మద్దతు వెల్లువెత్తుతోంది. కావలి కాలువ కింద పెరిగిన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఆధునికీకరణ జరగలేదు.



గడచిన నాలుగు సీజన్ల నుంచి ఆయకట్టు రైతులు సాగునీటికి కష్టాలు పడుతున్నారు. కావలి కాలువ సామర్థ్యం 650 క్యూసెక్కుల కాగా పూడిక పేరుకుపోవడం, నిర్వహణ లోపం తో అందులో సగభాగం నీరు కూడా కాలువలో పారడం లేదు. సంగం బ్యారేజీ నుంచి సుమారు 57 కిలోమీటర్ల పొడవున ఈ కాలువ ఉంది. 54 చెరువులు ఈ కాలువ ఆయకట్టు కింద ఉన్నాయి. కావలి కాలువ కింద కావలి పట్టణం, రూరల్, బోగోలు, దగదర్తి, జలదంకి మండలాలు ఉన్నాయి.



ప్రస్తుత రబీ సీజన్‌కు సంబంధించి నిర్వహించి ఐఏబీ సమావేశంలో కావలి కాలువ కింద 75 వేల ఎకరాలకు నీటిని ఇవ్వాలని అధికారులు, పాలకులు తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని అనుసరించి రైతులు సాగును ప్రారంభించారు. సాగు ప్రారంభించిన తర్వాత కావలి కాలువ అధికారులు ఆయకట్టు కింద ఉన్న 54 చెరువులకు, సుమారు 29 వేల ఎకరాలకు సాగునీటిని ఇవ్వలేమని చెప్పారు.



ఎందుకు అనధికారికంగా ఈ నిర్ణయం తీసుకున్నారో అంతుపట్టడం లేదు. నీటి కొరత అంటే.. అదీ లేదు. సోమశిల జలాశయంలో నీరు పుష్కలంగా ఉంది. కేవలం అధికార పార్టీ నేతల తీరు కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు తీరు కారణంగా అప్పులు చేసి సాగుచేసిన పొలాలు కళ్ల ముందు ఎండిపోతుండటంతో రైతు లు లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది.

 

ఫలించని ఎమ్మెల్యే ప్రయత్నాలు

కావలి కాలువ ఆయకట్టు రైతాంగం పడుతున్న సాగునీటి కష్టాలను తీర్చేందుకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఎక్కడని గడప.. దిగని గడప లేదన్న చందంగా ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశారు. సోమశిల విభాగంలోని అన్ని స్థాయిల ఇంజనీర్ల నుంచి కలెక్టర్ స్థాయి వరకు పలుమార్లు రైతాంగం పడుతున్న సాగునీటి వెతలు వారి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాకు చెందిన మంత్రితో పాటు ఇరిగేషన్‌శాఖ మంత్రిని కలిసినా ఫలితం లేకపోయింది. దీంతో ఉద్యమానికి సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒకటి..రెండు రోజుల్లో నిరశన దీక్షకు సంబంధించి ప్రకటన వెలువడనుంది.  

 

రైతుల కోసం నిరాహార దీక్ష :  


కావలి కాలువ కింద ప్రస్తుతం సాగులో పంటలు ఎండిపోకుండా సాగునీటిని విడుదల చేయించేందుకు నిరాహార దీక్ష చేపడుతా. ఐఏబీలో నిర్ణయించిన మేరకు ఆయకట్టు రైతాంగానికి సాగునీటిని విడుదల చేయాల్సిందే. ఇప్పటికే సాగునీటి విడదల చేయాలని అందరిని కలిసి విజ్ఞప్తి చేశా. ఇక ఓపిక లేదు.. రైతాంగం శ్రేయస్సు కోసం అధికార యంత్రాంగానికి, పాలకుల కళ్లు తెరిపించే విధంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.



కావలి కాలువ ఆయకట్టు రైతాంగం పడుతున్న సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరకాలని నిరాహార దీక్షను చేపడుతున్నాను. సంగం బ్యారేజీ ఆధునికీకరణ ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. కావలి కాలువ ఆధునికీకరణను చేపట్టాలి. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే విధంగా ఇప్పుడున్న కాలువ సామర్థాన్ని 1200 క్యూసెక్కులకు పెంచాలి.               

 - రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే

 

సాగునీరు అందివ్వడంలో నిర్లక్ష్యం:

సాగునీటిని ఇవ్వడంలో అధికారులు విఫలంకాగా, సర్కారు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. కావలి కాలువ రైతాంగం సంక్షే మం కోసం నిరాహార దీక్షను చేపట్టనున్న ప్రతాప్‌కుమార్‌రెడ్డికి రైతులందరూ సంఘీభావం ప్రకటించాలి. కావలి కాలువ రైతులు ఎంతో కాలంగా సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. సోమశిల ప్రాజెక్టులో నీరు ఉన్నా కావలి కాలువ రైతులకు సాగునీరందకపోవడం దారుణం.

 - వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే.

 

సాగునీరు అందించాలి:   

కావలికాలువ ద్వారా దామవరం మైనర్ చానల్‌కు సాగునీరు అందకపోవడంతో ఈ ఏడాది కాలువ పరిధిలో వెయ్యి ఎకరాలు పైన బీడు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కావలి కాలువ ఆధునికీకరణ చేపట్టి ఆయకట్టు పరిధిలోని భూములకు నీరివ్వాలి. - వట్టికాళ్ల తిరుపతి, రైతు, నారాయణపురం, దగదర్తి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top