పోలీసు పహరా మధ్య పాఠాలు

Police Protection For Government School SC colony Prakasam - Sakshi

నేకునాంపురం ప్రభుత్వ పాఠశాల వద్ద ఉద్రిక్తత

బడి నుంచి ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల గెంటివేత

హెచ్‌ఎంను బయట ఉంచి స్కూల్‌కు తాళం

పోలీసు బందోబస్తు నడుమ తరగతుల నిర్వహణ

వలేటివారిపాలెం మండలం నేకునాంపురం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల వద్దమంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 5వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకుపాల్పడిన ఉపాధ్యాయుడికి మద్దతుగా ఆయన సామాజిక వర్గానికి చెందిన కొందరు గ్రామస్తులు మంగళవారం రంగంలోకి దిగారు. దళితవిద్యార్థులను పాఠశాల నుంచి బటయకుగెంటేసి స్కూల్‌కు తాళాలు వేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు బడి తాళాలు తెరిపించారు. దగ్గరుండి తరగతులు నిర్వహింపజేశారు.

వలేటివారిపాలెం ,ప్రకాశం, (కందుకూరు అర్బన్‌): నేకునాంపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఎస్సీ సామాజక వర్గానికి చెందిన విద్యార్థులు 11 మంది, ఎస్టీలు 15 మంది, బీసీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ఉన్నారు. వీరికి భారతిలక్ష్మి అనే హెచ్‌ఎం, ఉన్నం వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు విద్యా బోధన చేస్తున్నారు. అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైగింక వేధింపులకు పాల్పడిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్సీ కాలనీకి చెందిన విద్యార్థిని బంధువులతో పాటు గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకొని లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఏంఈఓ నేకునాంపురం పాఠశాలకు చేరుకొని సంఘటనకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎంఈఓ సూచన మేరకు ప్రధానోపాధ్యాయురాలు భారతిలక్ష్మి ఇక్కడ జరిగిన పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు ప్పాడిన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లును సస్పెండ్‌ చేశారు. బాధిత విద్యార్థినికి అండగా ఉండాల్సిన గ్రామస్తులు.. ఉపాధ్యాయుడిని పైనేసుకొచ్చారు. మంగళవారం పాఠశాలకు వెళ్లిన ఎస్సీ విద్యార్థులను తమ పాఠశాలకు రావద్దంటూ బయటకు గెంటేశారు. హెచ్‌ఎంను బయట నిలబెట్టి దూషించి పాఠశాలకు తాళాలు వేశారు.

పోలీసు పహరా మధ్య పాఠాలు..
నేకునాంపురం ప్రభుత్వ పాఠశాలకు గ్రామస్తులు కొందరు తాళాలు వేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పాఠశాలను దగ్గరుండి తెరిపించారు. ప్రభుత్వ పాఠశాలను మూసివేసే హక్కు ఎవరికీ లేదని, ఎవరైనా పాఠశాల వైపు వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. పోలీసుల పహరా మధ్య పాఠశాలను కొనసాగించారు.

ఎస్సీ కాలనీలో పాఠశాల నిర్వహించాలి..
నేకునాంపురం ఎస్సీ కాలనీలో పాఠశాల నిర్వహించాలని ప్రజలు ఎంఈఓ రాంబాబుకు వినతిప్రతం అందజేశారు. మొత్తం పాఠశాలలో 27 మంది విద్యార్థులు చదువుతుంటే 11 మంది ఎస్సీ, 15 మంది ఎస్టీ, ఒక్క బీసీ విద్యార్థి చొప్పున ఉన్నారని తెలిపారు. ఇక్కడ తమ పిల్లలకు రక్షణ లేదని, వెంటనే ప్రభుత్వం తమ కాలనీలో పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top