జన జాతర
ఆత్మీయ బంధువుకు అదిరే స్వాగతం
తంగేడు రాజుల కోటలో జనప్రవాహం
మూడు కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర
సమస్యలు వింటూ.. భరోసానిస్తూ సాగిన ఐదోరోజు ప్రజాసంకల్పయాత్ర
పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రవేశం
కోటవురట్ల మండలంలో కదం తొక్కిన జనం
సాక్షి, విశాఖపట్నం: జనసమ్మోహనం..ఎటు చూసినా జనప్రభంజనం..ఐదోరోజు పాదయాత్రలో ఇసుకేస్తే రాలనంత జనం. జననేత వెంట అడుగులో అడుగు వేస్తూ వేలాది జనప్రవాహం. పాదయాత్ర సాగిన పల్లెల్లో ఎటు చూసినా కోలాహలమే..ఎటు చూసినా పండుగ వాతావరణమే. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఎదురేగి ఎలా స్వాగతం చెబుతామో..అలాగే తమ ఊరుకి వస్తున్న ఆత్మీయ బంధువుకు ఘనస్వాగతం çపలికేందుకు ఆ పల్లెలు కదిలివచ్చాయి. రోడ్లకిరువైపులా బారులు తీరాయి. ఎదురేగి స్వాగతం పలికాయి. ఇరుకు రహదారుల్లో చామంతి.. బంతిపూలు చల్లి జననేత నడిపించాయి. అడుగడుగునా జననీరాజనాలు పలికాయి. తంగేడు రాజుల కోటలో జనహృదయ మారాజుకు ఘన స్వాగతం లభించింది. మేళతాళాలు, తీన్మార్ డప్పు నృత్యాలు, బాణసంచా పేలుళ్లలతో పల్లెలు మార్మోగాయి.
వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర జిల్లాలో ఐదోరోజునర్సీపట్నం నియోజక వర్గం నుంచి పాయకరావు పేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. 241వ రోజు పాదయాత్ర జిల్లాలో జోగినాథునిపాలెం శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర ధర్మసాగరం క్రాస్, అన్నవరం, యండపల్లి, జల్లూరు, తంగేడు, రాజుల తంగేడు, కే.వెంకటాపురం క్రాస్, కోటవురట్ల మీదుగా కైలాసపట్నం వరకు సాగింది. కోటవురట్ల మండలంలో అడుగుపెట్టింది మొదలు రాత్రి బస వరకు జనమే జనం. బహిరంగ సభ జరిగిన కోటవురట్ల అయితే దద్దరిల్లిపోయింది.
తంగేడు రాజుల కోటలో జననేతకు ఘన స్వాగతం
తంగేడురాజులకు కంచుకోటైన కోటవురట్లలో జననేతకు ఊహించని రీతిలో జనం బ్రహ్మరథం పట్టారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, పార్టీ అదనపు కార్యదర్శి దత్తుడు సీతబాబు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆర్ఎస్ రామచంద్రరాజు, ఏటికొప్పాక షుగర్స్ మాజీ చైర్మన్ రామభద్రరాజు, జిల్లా అధికార ప్రతినిధి గొలిశెట్టి గోవింద్లతో పాటు కో ఆర్డినేటర్లు మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణలు ఘన స్వాగతం పలికారు. అడుగు తీసి అడుగు వేయలేనంతగా జనం పోటెత్తారు. మూడు కిలోమీటర్ల మేర రోడ్డు కిక్కిరిసిపోయింది. దారి పొడవునా బాణసంచా కాల్పులతో మార్మోగింది. పొడుగు కర్రలతో నడుచుకుంటూ యువకులు, మిక్కీ మౌస్ దుస్తులు ధరించిన యువకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఒక్కసారి నీ చేయి ఇవ్వన్నా లేకపోతే ఇక్కడే చచ్చిపోతాం
జగన్తో కరచాలనం కోసం, సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. సెల్ఫీలకు అవకాశం చిక్కిన వారు సంబరపడగా చిక్కని వారు మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయడం కన్పించింది. అన్నా ఒక్క సారి నీ చేయి అందుకోవాలని ఉందన్నా.. లేకుంటే ఇక్కడే చనిపోతామంటూ పలువురు కార్యకర్తలు యండపల్లి వద్ద బిగ్గరగా కేకలు వేయడంతో సెక్యురిటీ సిబ్బందిని వారించి వారిని లోపలకు రప్పించి కరచాలనం చేయడమే కాదు..సెల్ఫీలు కూడా తీయించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చంకన చంటి బిడ్డలతో తల్లులు ఉరుకులు పరుగులు పెడుతూ జగన్ వెంట పరుగులు తీశారు. అడుగో జగన్, అడుగడుగో జగన్.. చూడు చూడంటూ పిల్లలకు తల్లులు చెప్పి అభివాదాలు చేయించారు. వృద్ధులు, మహిళలు సైతం తమ వయస్సును లెక్క చేయకుండా పాదయాత్రలో జననేత వెంట కదం తొక్కారు. ఇక స్కూలు పిల్లలు సైతం పోటీపడ్డారు. నర్సింగ్ విద్యార్థులు, వందలాది మంది పిల్లలు స్కూలు డ్రస్సులతోనే రోడ్లపై నిలబడి జగన్ చూసేందుకు ఆరాట పడ్డారు.
అడుగడుగునా సమస్యల వెల్లువ
పాదయాత్రలో ఉదయం పూట అడుగడుగునా ప్రజలు గడిచిన నాలుగున్నరేళ్లలో తాము పడుతున్న సమస్యలను జననేత వద్ద చెపుకుని బావురమన్నారు. రుణమాఫీ పేరు చెప్పి నిండా ముంచాడన్నా అని యండపల్లికి చెందిన అనిమిరెడ్డి రాజబాబు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. బాండు కోసం అమరావతి చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదన్నా అని చెప్పుకున్నారు. బాబు నువ్వు సల్లంగుండాలి...నువ్వు వస్తావు.. మీ నాయనలా మంచి పాలన ఇస్తావు అంటూ 72 ఏళ్ల పెట్ల కొండమ్మ అనే వృద్ధురాలు జగన్ను ఆశీర్వదించింది. క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని క్షత్రియ పోరాట సాధన సమితి తరఫున మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్య నారాయణరాజు ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు జల్లూరు వద్ద వినతిపత్రం అందించారు. తమకు జీతాలు పెంచామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు ఇందుకు సంబంధించిన జీవోలు ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు, ఉపాధి కల్పించాలని రావికమతం మండలం కొత్తకోటకు చెందిన అడ్డాకు కార్మికులు మొరపెట్టుకున్నారు. ఇవే కాదు..పింఛన్లు ఇవ్వడం లేదని. ఉపాధి పనులు కల్పించడం లేదని జగన్కు వినతిపత్రాలు సమర్పించారు.ప్రభుత్వ నిర్వాకం వల్ల తాము రోడ్డున పడుతున్నామని మధ్యాహ్న భోజన కార్మికులు వాపోయారు. ఇలా ఒకటి కాదు..రెండు కాదు వందల సంఖ్యలో వినతులు వెల్లువెత్తాయి.
పాదయాత్రలో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా సమన్వయకర్త వరుదు కల్యాణి, ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ఎంపీ అవినాష్రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, సమన్వయకర్తలు గొల్ల బాబూరావు, వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, పెట్ల ఉమాశంకర గణేష్, కరణం ధర్మశ్రీ, కె.కె.రాజు, తిప్పల నాగిరెడ్డి, చిత్తూరు నుంచి సామాన్య కిరణ్, శిల్పా రవి చంద్రారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, సీఈసీ సభ్యులు కాకర్లపూడి శ్రీకాంత్, అంకంరెడ్డి జమీల్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆర్.ఎస్.రామచంద్రరాజు, ఏటికొప్పాక సుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ ఆర్.ఎస్.రామభద్రరాజు, రాష్ట్ర యూత్ కార్యదర్శి గుడ్ల పోలిరెడ్డి, నగర యూత్ అధ్యక్షుడు కొండా రాజీవ్గాంధీ, సాం స్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష, కుంభా రవిబాబు, అరకు పార్లమెంట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు కోడ సింహాద్రి, ప్రగడ నాగేశ్వరరావు, రుత్తల ఎర్రాపాత్రుడు, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, కొండా రాజీవ్ గాంధీ, బొలిశెట్టి గోవింద్, ఏడువాక సత్యనారాయణ, ఉపమాక దేవస్థానం మాజీ చైర్మన్ సీహెచ్. ఆర్.ఎస్. ఎన్.రాజు, పోతల లక్ష్మీరమణమ్మ, షావలీ, మో పాడ స్వామినాయుడు, నూతులపాటి సోనీవుడ్, డాక్టర్ సౌమ్య, లాలం బాబ్జీ, కొణతాల శ్రీనివాసరావు, కొరుపోలు సుధాకర్, పక్కి దివాకర్, రవి రెడ్డి, కిరణ్రాజు, సుధాకర్ సీతన్న రాజు, శిల్లా కరుణాకరెడ్డి, వంశీకృష్ణ, చిల్ల శ్రీనివాసరెడ్డి, పిన్నింటి ఎర్రయ్యరెడ్డి, కోండ్రు రామసూరప్పడు, మాజీ సర్పంచ్ పెట్ల సత్యవతి, మాజీ ఎంపీటీసీ పెట్ల కళావతి, బొట్టా స్వర్ణ, బొలిశెట్టి గోవింద్, కొణతాల శ్రీనివాసరావు, కొరుపోలు సుధాకర్, సుర్ల సత్యనారాయణ, నారాయణమూర్తి రాజు, దత్తుడు బాబు, గనివాడ పృధ్వి, జడ్పీటీసీ సభ్యురాలు కంకిపాటి పద్మకుమారి, వంతర వెంకటలక్ష్మి, మాజీ ఎంపీపీలు మత్స్యరాస వెంకట గంగరాజు, ఎస్.వి.వి. రమణమూర్తి, వి.మత్స్యకొండబాబు, పైలా సత్యనారాయణ, బిషప్ జీవన్రాయ్, పీలా వెంకటలక్ష్మి పాల్గొన్నారు.