జననేతకు సమస్యలు విన్నవించుకున్న ప్రజలు
సాక్షి, విజయనగరం: ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ సమస్యలు వివరిస్తూ..వినతిపత్రాలను బాధితులు ఇస్తున్నారు. ప్రజాసంకల్పయాత్ర ఆరంభమైన కొద్దిసేపటికే విద్యా రిసోర్స్ ఉపాధ్యాయుల ఐక్యవేదిక ప్రతినిధి శ్రీనివాస రావు కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న తమను అదే పోస్టుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. దత్తిరాజేరు మండలం మరడాం గ్రామస్తులు వైఎస్ జగన్ను కలిశారు. ఏడొంపుల గెడ్డను టీడీపీ నాయకులు తమకు అనుకూలమైన వారి పొలాలకు మళ్లిస్తున్నారని, ఫలితంగా తమ గ్రామంలో పన్నెండు వందల ఎకరాలకు నీరందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దత్తిరాజేరు మండలంలో ఏటా పన్నెండు వందల మంది విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధిస్తున్నా మండల కేంద్రంలో జూనియర్ కళాశాల లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. మెంటాడ మండలం కుంటినవలస గ్రామస్తులు వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెపుకున్నారు. తమకు భూమి లేదని, ఉండటానికి ఇళ్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదని, రాజకీయ కారణాల వల్ల తమకు ఫించన్లు రాకుండా చేస్తున్నారని వాపోయారు. ఉపాధి లేక ఊర్లో సగం మంది చెన్నై వలసలు పోతున్నామని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు అన్ని అర్హతలున్నా రాజకీయ కారణాల వల్ల తన కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి అంగన్వాడీ టీచర్ పోస్టు కేటాయించారని దత్తిరాజు మండలం వంగర గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తి తన బాధను వ్యక్తం చేశారు. ఇళ్లిస్తామని రెండు వేల రూపాయలు తీసుకుని ఏళ్ల తరబడి తిప్పుకుంటున్నారని, కొడుకు చనిపోయినా కోడలు, మనవళ్లతో అనాథలయ్యామని, ఇప్పుడు ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని లింగాల తవుడమ్మ అనే వృద్ధ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పెరిగిన పెట్టుబడి కారణంగా పాల సేకరణ ధర చాలకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పాడి రైతు వైఎస్ జగన్ ఎదుట చెప్పుకున్నారు. వైఎస్ జగన్ అందరి సమస్యలు వింటూ భరోసా కల్పిస్తూ ప్రజాసంకల్పయాత్రలో ముందుకు సాగుతున్నారు.