నువ్వే మా ఆశాకిరణం
విశాఖపట్నం :‘అడుగడుగునా దగాపడుతున్నాం. పింఛన్కు దరఖాస్తు చేస్తే అర్హత లేదంటారు. రేషన్ కార్డు కావాలంటే సాధికారిత సర్వేలో సవరణ చేసుకురమ్మంటారు. పూర్తి అర్హత ఉన్నా వికలాంగులకు రూ.1000 పింఛన్ మాత్రమే ఇస్తామం టున్నారు. ఉన్నత విద్యనభ్యసిం చాం ఉద్యోగ అవకాశం కల్పించండి అని అడిగితే.. అదిగో ఇదిగో నోటిఫికేషన్లు అంటూ తప్పించుకుంటున్నారు. న్యాయమైన కోర్కెలు తీర్చాలని అడిగితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా తక్కువ చేసి మాట్లాడతారు. ఎలా బతకాలి జగనన్న. ఈ కష్టాలు.. కన్నీళ్లు.. ఇంకెన్నాళ్లు.. మా బతుకులు మారాలంటే నువ్వు రావాలి.. నువ్వే కావాలి. మా ఆశాకిరణం నువ్వే..’ అంటూ ప్రజా సంకల్పయాత్రలో జననేతను కలసిన ప్రతి హృదయం స్పందిస్తోంది. వారందరి సమస్యలు ఓపికగా వింటూ.. ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇస్తూ మహానేత మద్దుబిడ్డ ముందుకు సాగుతున్నారు.– ప్రజా సంకల్పయాత్ర బృందం
ఎస్సీ హాస్టల్ అధ్వానంగా ఉంది
మాది శాలిపేట. ఎస్సీ విద్యార్థులు చదువుకునే హాస్టళ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హాస్టల్లో మెరుగైన తాగునీరు సౌకర్యం, శుభ్రమైన మరుగుదొడ్లు లేకపోవడంతో ఇటీవల విద్యార్థులు డెంగ్యూ భారీన పడి అనారోగ్యం పాలయ్యారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలను టీడీపీ కార్యకర్తలే వారి స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. నిజమైన పేదవారికి కార్పొరేషన్ రుణాలు అందేలా వైఎస్ జగన్ మోహన్రెడ్డి కృషి చేయాలి. హుద్హుద్లో గృహాలు కోల్పోయిన వారికి నూతన గృహాలు ఇస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం నేటికీ ఇవ్వలేదు. మా సమస్యలు పరిష్కరించి అంబేడ్కర్ కలలను సాకారం చేయాలి. – తాడి రవితేజ, విశాఖపట్నం
సామాజిక భవనాలు నిర్మించండి
నాయీ బ్రాహ్మణులకు టీడీపీ ప్రభుత్వం ఎక్కడా సామాజిక భవనాలు నిర్మించలేదు. శుభాకార్యాలు చేసుకోవాలంటే ప్రయివేట్ ఫంక్షన్ హాళ్ల అద్దె భరించలేకపోతున్నాం. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే నాయీ బ్రాహ్మణులకు మండలానికో కమ్యూనిటీ భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి.–యర్రవరపు శంకరరావు, తగరపువలస
పెన్షనర్ల అభ్యున్నతికి తోడ్పడాలి
రాష్ట్రంలో 3.50 లక్షల మంది పెన్షనర్లు చంద్రబాబు విధానాల వలన ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పీఆర్సీలో పెన్షనర్లకు రాయితీలు అమలు చేయకపోగా.. హెల్త్కార్డుల ద్వారా అందించే చికిత్స నుంచి ప్రధానమైన వ్యాధులను తొలగించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద కొడుకులా పెన్షనర్ల అభ్యున్నతికి తోడ్పడాలి. – అజమ్ ఆలీ, వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ కార్యదర్శి
పాపకు ఆపరేషన్ చేయించాలన్నా..
మా పాప ఎన్.లిఖిత సాయి భవానీకి పుట్టుకతోనే మాటలు రావడంలేదు. ఆరోగ్య పరిస్థితి కూడా అంతంతమాత్రమే. చెవులు సరిగా వినబడటం లేదు. పాపకు ఆపరేషన్ చేయించాలని ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దీనికి రూ.5 నుంచి రూ. 6 లక్షల వరకు అవుతాయన్నారు. మేము ఎస్సీలం.. రోజూవారీ కూలికి వెళితేగాని పూట గడవని పరిస్థితిలో ఉన్నాం. ఆపరేషన్ చేయించే ఆర్థిక స్థోమత లేదు. ఈ విషయాన్ని ప్రజాసంకల్పయాత్రలో జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించుకున్నాను. త్వరలో మన ప్రభుత్వం వస్తుందని, ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ ఉచితంగా చేయిస్తానని జగనన్న హామీ ఇచ్చారు. – ఎన్.ప్రకాష్, చినవాల్తేరు రెల్లివీధి, విశాఖపట్నం
బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నా..
నాలుగేళ్ల కిందట నాకు బ్లడ్ క్యాన్సర్ అని వైద్యులు నిర్ధరించారు. అంతకుముందు వెన్నుపూస ఆపరేషన్ చేయించుకున్నాను. తర్వాత రెండేళ్ల పాటు బాగానే ఉంది. తర్వాత చెవులు, ముక్కు నుంచి రక్తం రావడం చూసి వైద్యులను చూపిస్తే.. ఆపరేషన్ చేయాలని సూచించారు. ఈ ఆపరేషన్కు సుమారుగా రూ.25 నుంచి 30 లక్షలు అవుతుందని అన్నారు. ఈ ఆపరేషన్ అయ్యేంత వరకు మాత్రలు వాడాలి. లేదంటే వాంతులు అవుతున్నాయి. వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఈ విషయాన్ని విన్నవించుకున్నాను. న్యాయం చేయాలని వేడుకున్నాను. – రాజు కుమారి బెన్నహెర్, సీతమ్మధార, విశాఖపట్నం
అసిస్టెంట్ డాక్టర్లుగా గుర్తించాలి
నేను కేర్లో మేల్ నర్స్గా పని చేస్తున్నాను. 2009లో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశాను. ఎంబీబీఎస్ కూడా నాలుగేళ్ల కాలపరిమితి గల విద్య అయినందున మమ్మల్ని అసిస్టెంట్ డాక్టర్లుగా గుర్తిస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి మఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాటిచ్చారు. ఆయన మరణంతో ఆ హామీ నేరవేరలేదు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి ఈ తొమ్మిదేళ్లలో ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సింగ్ అభ్యర్థులను అసిస్టెంట్ డాక్టర్లుగానూ, పీహెచ్సీల్లో ఉద్యోగులుగా నియమించాలి. ఇదే విషయాన్ని జగనన్న దృష్టికి తీసుకెళ్లాను. గెడ్డం దిలీప్రాజా, విశాఖపట్నం
మాది విశాఖపట్నం. 2004 సెప్టెంబర్ 1వ తేదీ తరువాత రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులుగా విధుల్లో చేరినవారందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అనే నూతన పద్ధతిని ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారు. ఈ పద్ధతిలో ఉద్యోగి నుంచి కొంతపొమ్మును ఎటువంటి హామీ లేకుండా ప్రభుత్వమే షేర్మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి వచ్చిన ఆదాయంతో పెన్షన్ చెల్లించేలా నిర్ణయించింది. ఈ పద్ధతిలో అతి తక్కువ పింఛను మాత్రమే లభిస్తుంది. ఈ పద్ధతిని రద్దు చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే ఈ అంశం కేంద్ర పరిధిలోదంటు దాటవేస్తోంది. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి.
– బి.శ్రీరామ్యాదవ్,ఏపీసీపీఎస్ఈఏ అర్బన్ కన్వీనర్
రూ.1000 మాత్రమే పింఛన్ ఇస్తున్నారు
మా మనువరాలు అన్నం సురేఖ పుట్టుకతోనే వికలాంగురాలు. 90 శాతం వైకల్యం కలిగి ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో వికలాంగ పింఛన్ మంజూరైంది. అప్పట్లోనే వికలాంగులకు రూ.500 పింఛన్ ఇచ్చేవారు. వికలాంగులందరికీ రూ.1500 పింఛన్ ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు..ఇప్పుడు నిబంధనల పేరుతో కేవలం రూ.వెయ్యి మాత్రమే చెల్లిస్తున్నారు. పక్కా ఇల్లు కావాలని పలుమార్లు దరఖాస్తులు చేసినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అద్దెలు చెల్లించలేకపోతున్నాను. నా సమస్యను జగన్ బాబు దృష్టికి తీసుకువెళ్లాను. ఆయన సీఎం అయితేనే మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. – అన్నం కాంతం, కొయ్యవీధి, చినవాల్తేరు
సంబంధిత వార్తలు