మురిసిన గ్రామీణం.. అడుగడుగునా

People Support To YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

రూరల్‌ విశాఖలో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

గన్నవరం మెట్ట మొదలు జెర్రిపోతులపాలెం వరకు జనప్రవాహం

పూల బాటలు పరిచి గ్రామగ్రామాన బ్రహ్మరథం

అన్ని వర్గాల ప్రజలతో జననేత మమేకం.. నేనున్నానంటూ భరోసా

నిరంతర పథికుడి పలుకులతో పరవశించిన పల్లె ప్రజలు

ఊళ్లకు ఊళ్లు తరలివచ్చాయి. తమ చెంతకొస్తున్న ఆత్మీయ బంధువు కోసం ఉత్తుంగతరంగంలా ఎగసిపడ్డాయి. తాండవ, వరాహ, శారద, సర్ప నదులన్నీ ఒక్కసారే ఉప్పొంగినట్టుగాపాదయాత్ర దారుల్లో జన పరవళ్లు తొక్కాయి. చుట్టూ ఎత్తయిన కొండలు.. చెరుకు గెడల ఊగిసలాటలు.. రోడ్డుకిరువైపులా తలలూపుతూ కొబ్బరి, తాటిచెట్లు, పచ్చని వరికంకుల మధ్య కల్మషం లేని పల్లె మనసులు జనహృదయ నేతకు అపూర్వ స్వాగతం పలికాయి. అక్కున చేర్చుకున్నాయి. ఆదరించాయి. అడుగులో అడుగు వేసి కదం తొక్కాయి.

సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ముఖద్వారంలో అడుగుపెట్టింది మొదలు విశాఖ గ్రామీణ జిల్లాలో అడుగడుగునా జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆగస్టు 14న నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది మొదలు నేటి వరకు ప్రజాసంకల్ప యాత్ర ప్రభంజనంలా సాగింది. తొలి అడుగులు వేసేందుకు వేలాదిమంది ఎదురేగి గన్నవరం మెట్ట వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగింది. సుదీర్ఘ పాదయాత్ర విశాఖ గ్రామీణంలోనే రెండు అరుదైన మైలురాళ్లను అధిగమించింది. యలమంచిలి వద్ద 2,800 కిలోమీటర్లు, సబ్బవరం వద్ద 2,900 కిలోమీటర్ల మైలురాళ్లను దాటి లక్ష్యం వైపు దూసుకెళ్తోంది.

అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ పల్లె ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. నుదిటిపై తిలకం దిద్ది మంగళ హారతులిస్తూ దిష్టి తీస్తూ మహిళలు అక్కున చేర్చుకున్నారు. లేవలేని వృద్ధులు సైతం జననేతను చూసేందుకు గంటల తరబడి మండుటెండ, జోరు వానలను సైతం లెక్క చేయకుండా ఎదురు చూశారు. అవ్వా తాతలు, మహిళలు, యువత, పేదలు, రైతులు, చిరుద్యోగులు, వ్యా పారులు, వివిధ కుల వృత్తులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు జన హృదయ నేతకు తమ కష్టాలు చెప్పుకుని ఊరట పొందారు. ఇళ్లు, పింఛన్లు  ం లేదని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించడం లేదని, ఉద్యోగాలు రావడం లేదని, ఉన్న కొలువులు ఊడదీశారని, తాగు, సాగునీరు అందడం లేదని, అధికార టీడీపీ నేతల భూకబ్జాలు, దందాలు, అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని.. ఇలా ఒకటేమిటి వందలు, వేల వినతులు వెల్లువెత్తాయి. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కర్నీ చక్కని చిరునవ్వుతో పేరుపేరునా పలుకరించి వారి కష్టాలు తెలుసుకుని కన్నీళ్లు తుడుస్తూ మీకు అండగా నేనున్నానంటూ భరోసానిస్తూ జననేత ముందుకు సాగారు.

చేరికలే చేరికలు..
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దివంగత ఆనం వివేకానందరెడ్డి కుమారుడితో సహా నెల్లూరు జిల్లాకు చెందిన వందలాది మంది వేచలం క్రాస్‌ (చీకటి తోట) వద్ద వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. రేగుపాలెం జంక్షన్‌ వద్ద చిలకలూరిపేటకు చెందిన విడదల రజని వందలాది మంది పార్టీ అనుచరులతో పార్టీలో చేరారు. ఒకప్పటి చింతపల్లి ఎమ్మెల్యే దివంగత గొట్టేటి దేవుడు కుమార్తె గొట్టేటి మాధవి కూడా వేలాదిమంది అనుచరులు, సీపీఐ శ్రేణులతో కలిసి పంచదార్ల వద్ద పార్టీలో చేరారు. నర్సీపట్నం వద్ద బీజేపీ సీనియర్‌ నేత రుత్తల ఎర్రాపాత్రుడు, సబ్బవరంలో కళా ఆస్పత్రి అధినేత డాక్టర్‌ రమణమూర్తి, ఎస్‌.కోటకు చెందిన బీజేపీ నాయకుడు రఘురాజు వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. వీరే కాదు బస చేసిన ప్రతి చోట వందలాది మంది వివిధ పార్టీల నుంచి వైఎస్సార్‌ సీపీలోకి చేరారు.

అల్లూరి నేలపై జాతీయ పతాకం రెపరెప
జిల్లాలో అడుగుపెట్టిన మర్నాడే స్వాతంత్య్ర దినోత్సవం రావడంతో డి.ఎర్రవరం జంక్షన్‌లో బస చేసిన ప్రాంతంలోనే వైఎస్‌ జగన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అల్లూరి నడయాడిన నేలపై జననేత జాతీయ పండుగలో పాల్గొనడంతో ఎర్రవరం మురిసిపోయింది. గ్రామీణ జిల్లాలో 21 రోజులపాటు 188.6 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపింది.

పాదయాత్ర దారుల్లో మేఘఛత్రం పట్టిన వరుణుడుజిల్లాలో అడుగు పెట్టింది మొదలు కొన్ని చోట్ల సూరీడు కాస్త చిటపటలాడించినా.. జననేత వెంటే నేనున్నానంటూ వరుణుడు తోడు వచ్చాడు. దారి పొడవునా జననేతను వర్షం పలుకరిస్తూనే ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షం కురిసినా తన కోసం ఎదురు చూస్తూ తనపై కురిపిస్తున్న అభిమాన జల్లుల ముందు ఈ వర్షం ఏపాటిదంటూ జననేత ముందుకు సాగారు. ఆయనతో కరచాలనం చేసేందుకు.. మాట్లాడేందుకు...సెల్ఫీలు తీసుకునేందుకు జనం పోటీపడ్డారు.

రికార్డులు తిరగరాసిన సభలు
ప్రతి నియోజకవర్గంలోనూ ఓ బహిరంగ సభ చొప్పున అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు బహిరంగ సభలు జరిగాయి. ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా అన్ని సభలు రికార్డులను తిరగరాసేలా ఇంటిలిజెన్స్‌ అంచనాలకు మించిన రీతిలో జరిగాయి. నర్సీపట్నంలో జరిగిన తొలి సభకు జోరు వానను సైతం లెక్కచేయకుండా వేలాది జనం పోటెత్తడంతో నర్సీపట్నం కిక్కిరిసిపోయింది. ఇక తంగేడు రాజుల కోటైన కోటవురట్లలో జనపరవళ్లు తొక్కింది. యలమంచిలిలో కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జనకెరటం ఎగసి పడింది. అనకాపల్లి నెహ్రూ కూడలి, చోడవరం కొత్తూరు జంక్షన్, కె.కోటపాడు ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర జనంతో జామ్‌ అయిపోయాయి.

బహిరంగ సభల్లో జననేత ఇచ్చిన ముఖ్యమైన హామీలు...
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం కింద         నాలుగు విడతల్లో రూ.75 వేలు

ఉచితంగా..
ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న అప్పు.. నాలుగు విడతల్లో చెల్లింపు
డ్వాక్రా సంఘాల్లో మళ్లీ సున్నా వడ్డీ విప్లవం
పేదవాళ్లకు ఇచ్చే ప్లాట్లపై వారు చెల్లించా ల్సిన రూ.3 లక్షలు మాఫీ
మూతపడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ
రైతులకు ఉచితంగా బోర్లు
మే నెలలోనే ప్రతి రైతు చేతికి ఖర్చుల కోసం రూ.12,500
ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50కే కరెంట్‌
పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4ల సబ్సిడీ
అనుకోకుండా ఏ రైతైనా చనిపోతే ఆ కుటుంబానికి వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.5 లక్షలు
రైతుల ట్రాక్టర్లకు రోడ్డు టాక్స్‌ నుంచి మినహాయింపు
కోల్డ్‌ స్టోరేజ్‌లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, గిడ్డంగుల ఏర్పాటు
రైతులకు పగటిపూటే 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌
ప్రతి రైతుకు వడ్డీ లేకుండానే రుణాలు
ఎన్‌ఏఓబీ నిర్వాసితులకు సముచిత న్యాయం
బ్రాండిక్స్‌ యాజమాన్యానికి మరింత మేలు చేసి.. ప్రతిఫలంగా కార్మికుల వేతనాలు పెంచేలా యాజమాన్యంపై ఒత్తిడి
అనకాపల్లివాసులు కేజీహెచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడి ఆస్పత్రి అభివృద్ధి
స్కూల్‌ ఫీజులు, కాలేజ్‌ ఫీజుల తగ్గింపు.. బిడ్డలను బడికి పంపే ప్రతి అక్కా
చెల్లెమ్మకు రూ.15 వేలు వారి చేతికే..
సింహాచలం భూ సమస్యకు పీఠాధిపతుల సహకారంతో పరిష్కారం
ఎన్టీపీసీ కాలుష్యం బారిన పడిన పిట్టవానిపాలెం, దేవాడ, మరణాసి గ్రామాల

తరలింపు.. పరిహారం చెల్లింపు..
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకే దక్కేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top