ఉంటా..మీ వెంటే..
కష్టాలు చెప్పుకుంటున్నవారికి జగన్ భరోసా
జనతోరణాలవుతున్న దారులు
250వ రోజు తుమ్మపాలలో ప్రారంభమైన పాదయాత్ర
సాక్షి, విశాఖపట్నం: జననేత కోసం దారులన్నీ జనతోరణమవుతున్నాయి. కష్టాలు తీర్చే నాథుడొచ్చాడంటూ ఆయా గ్రామాల ప్రజలు మురిసిపోతున్నారు. మీరే మా అండ..దండ అంటూ దారిపొడవునా బారులు తీరుతున్నారు. కష్టాలు చెప్పుకుంటూ...కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
తుమ్మపాల.. ఈ పేరు చెప్పగానే చక్కెర కర్మాగారం గుర్తొస్తుంది. ఒకప్పుడు చెరుకు, బెల్లం రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఈ కర్మాగారం నేడు మూతపడింది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సహకార రంగంలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలన్నింటినీ తెరిపిస్తామంటూ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన స్పష్టమైన హామీ వారిలో కొండంత భరోసా నింపింది. గురువారం తుమ్మపాల నుంచి దర్జీనగర్ వరకు సాగిన పాదయాత్రలో అడుగడుగునా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు, చెరుకు రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు. ఆరు నెలలు ఓపిక పట్టండి..మీ కష్టాలు తీరుస్తానంటూ జననేత అభయమివ్వడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని..మళ్లీ క్రషింగ్ జరిగేలా చూడాలని కోరిన ప్రతిసారి తప్పకుండా అంటూ జగన్ భరో సానివ్వడం వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపింది.
దారిపొడవునా ఉరకలెత్తిన ఉత్సాహం
ప్రజాసంకల్పయాత్ర గురువారం తుమ్మపాల నుంచి ప్రారంభమైంది. తుమ్మపాల నుంచి మార్టూరు క్రాస్, బవులవాడ క్రాస్, త్రిమూర్తుల వారి గుడి జంక్షన్, రిక్షాకాలనీ జంక్షన్, దర్జీనగర్, వూడేరు క్రాస్ మీదుగా పెట్రోల్ బంకు వరకు సాగింది. ఉదయం 8.40 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర మధ్యాహ్నం 12.45 గంటల వరకూ సాగింది. దారిపొడవునా మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు బారులు తీరి మరీ జననేతను చూసేందుకు ఉత్సాహంతో ఉరకలేశారు.సెల్ఫీలు...ఆటోగ్రాఫ్ల కోసం పోటీపడ్డారు. ఇక దారిపొడవునా వందలాది మంది తమ కష్టాలను జననేత వద్ద చెప్పుకోగా..నేనున్నానంటూ ఆయన ఇచ్చిన భరోసాతో ఊరట చెందారు.
పసుపుకుంకుమసొమ్ము పూర్తిగా వేయలేదు
పసుపుకుంకుమ కింద ఇప్పటి వరకు కేవలం ఆరువేలు మాత్రమే మా ఖాతాల్లో జమ చేశారని మిగిలిన సొమ్ము ఇంకా జమకాలేదన్నారు. మహానేత వైఎస్ ఇచ్చిన స్థలాలను చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటోందని మామిడిపాలెంకు చెందిన మహిళలు జగన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాల కోసం 14 రోజులుగా ధర్నా చేస్తుంటే పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని కశింకోట మండలం భీమవరం లిక్కర్ ఫ్యాక్టరీ కార్మికులు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇలా పెద్ద సంఖ్యలో వినతులు వెల్లువెత్తాయి. తమ గోడు చెప్పుకునేందుకు వచ్చిన ప్రతి ఒక్కరి వెతలను ఓపిగ్గా వింటూ ఆరు నెలలు ఆగండి..మనందరి ప్రభుత్వం రాగానే మీ అందరి కష్టాలు తీరుతాయ్ అంటూ భరోసానిస్తూ జననేత ముందుకు సాగారు. మాజీ ఎంపీ పి.మిథున్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్న పూస గోపాలరెడ్డి, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా సమన్వయకర్త వరుదు కల్యా ణి, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం సమన్వయకర్త తలారి వెంకటరావు, రాష్ట్ర కార్యదర్శులు దంతులూరి దిలీప్కుమార్, బొడ్డేడ ప్రసాద్, తాడి విజయ భాస్కరరెడ్డి, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్రాజు, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర యూత్ విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు సుంకర గిరిబాబు, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష, ఇచ్ఛాపురం నుంచి అందాల విక్రమ్, వైఎస్సార్ కడప జిల్లా నుంచి వీరప్రతాప్రెడ్డి, చొక్కాకుల వెంకటరావు, జిల్లా కార్యదర్శులు మళ్ల బుల్లిబాబు, దంతులూరి శ్రీధర్ రాజు, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్ ఆలీ, షబ్బీర్ సీరత్ కుమార్, మున్నీర్ ఖాన్, అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామ్, గొర్లె సూరిబాబు, జాజుల రమేష్, ఆనందపురం, పద్మనాభం మండల పార్టీ అధ్యక్షులు బంక సత్యం, కంటుబోతు రాంబాబు, నమ్మి వెంకటరావు, కిరణ్రాజు, మామిడి నూకరాజు, జి.వెంకటరావు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, రాపే టి వెంకటేష్, పల్లా తాతారావు, చొప్పా నాయు డు, కొవ్వాడ సూర్యనారాయణ, దంతులూరి కల్యాణ్, ఎర్రంశెట్టి పైడయ్య, అల్లవరం నాగమల్లేశ్వరి, మత్స్యరాస వెంకట గంగరాజు, నారపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలన్నా..
తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని వ్యవసాయ దారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పీలా బుజ్జి, ఎం.మోతునాయుడు తుమ్మపాల వద్ద వైఎస్జగన్ను కలిసి వేడుకున్నారు. వరుసగా రెండుసార్లు టీడీపీ హయాంలోనే ఈ ఫ్యాక్టరీ మూతపడిందని, నాడు వైఎస్ తెరిపించారని, మళ్లీ మీరొచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. తుమ్మపాల ఫ్యాక్టరీలో పనిచేసిన రెగ్యులర్, దినసరి కార్మికులకు 48 నెలలుగా జీతభత్యాలు చెల్లించలేదని, సుమారు రూ.15 కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయని ఫ్యాక్టరీ కార్మికులు జగన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆర్థికంగా చితికిపోవటం వలన అనారోగ్యాల పాలై 39 మంది కార్మికులు మృత్యువాతపడ్డారని జగన్ దృష్టికి తీసుకొచ్చారు.
రైతే పంట ధర నిర్ణయించుకునే చట్టం తేవాలి
ఎవరు తయారు చేసిన వస్తువుల ధరలను వారే నిర్ణయించుకున్నట్టుగానే రైతు పండించే పంటకు రైతే ధర నిర్ణయించుకునే అవకాశం ఇవ్వాలని పలువురు రైతులు జగన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. బాబు అధికారంలోకి వస్తే కుదవపెట్టిన బంగారు ఆభరణాలన్నీ విడిపిస్తామని నమ్మబలికితే ఓట్లేశామని కానీ నేటికీ మా బంగారు వస్తువులు బ్యాంకులోనే ఉన్నాయని, నాడు తీసుకున్న రూ.3లక్షల రుణానికి నేటికీ వడ్డీ చెల్లిస్తూనే ఉన్నామని మామిడిపాలెం శ్రీ సాయి గ్రూపునకు చెందిన డ్వాక్రా సంఘ సభ్యులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు.