జనాదరణ అపూర్వం
ఏ పల్లెకు వెళ్లినా అదే ఆప్యాయత
అభిమాననేత వెంట కిలోమీటర్ల మేర అడుగులు వేస్తున్న జనం
పల్లెల్లో వినూత్న రీతిలో అపూర్వ స్వాగతం
233వ రోజు సంకల్పయాత్రలో ఆదివాసీలతో అడుగులు
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి ,కాకినాడ: ఏ పల్లెకు వెళ్లినా జనమే జనం. జననేత అడుగు పెట్టాక జనజాతరను తలపిస్తున్నాయి. వ్యవసాయ కూలీలు, రైతులు, వికలాంగులు, మహిళలు, విద్యార్థినీ విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో అడుగులు వేస్తున్నారు. కిలోమీటర్ల మేర అభిమాన నేత వెంట నడుస్తున్నారు.అలుపెరగని యోధుడికి సంఘీభావం తెలుపుతున్నారు. తమ బాధలు చెప్పుకుని ఉపశమనం పొందుతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర ఆద్యంతం తండోప తండాలుగా జనం తరలిరావడంతో రహదారులు జనదారులుగా మారిపోతున్నాయి. పాదయాత్ర సాగే గ్రామాల్లో వినూత్న రీతిలో అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. పాదయాత్రికుడి రాకను పండగగా జరుపుకొంటున్నారు.
మూడో రోజూ అదే ఆదరణ
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 233వ రోజు ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని రౌతులపూడి మండలంలో పారుపాక జంక్షన్ నుంచి ప్రారంభమై డీజేపురం శివారు వరకు కొనసాగింది. గురువారం 6.2 కిలోమీటర్ల మేర నడిచారు. మూడో రోజు కూడా రౌతులపూడి మండలంలో అదే ఆదరణ, ఆప్యాయతను చూపించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో పారుపాక జంక్షన్ వద్ద పాదయాత్ర ప్రారంభం కాగా డీజే పురం చేరుకునేసరికి జన ప్రభంజనమైంది. దారి పొడవునా స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. వేద పండితులు సంప్రదాయ రీతిలో పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, మహిళలు మంగళహారతులు ఇచ్చారు. జననేతను చూసేందుకు ఊరు ఊరంతా కదలి వచ్చింది. వైఎస్ జగన్ వస్తున్నారన్న సంతోషంతో పాదయాత్ర సాగే రహదారిపై చీరలు పరిచారు. జననేత పాదాలకు ధూళి అంటకూడదని రహదారి పొడవునా రెడ్ కార్పెట్ మాదిరిగా చీరల మీదుగా నడిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక పాదయాత్ర ఆద్యంతం విద్యార్థులు, మహిళలు సెల్ఫీల కోసం ఉత్సాహం చూపారు. విద్యార్థినులు, రైతులు, వృద్ధులు జననేతతో కలిసి అడుగులు వేశారు. ఎక్కడా ఎవరినీ నిరాశపరచకుండా అందరితో కరచాలనం చేసి వైఎస్ జగన్ ముందుకు సాగారు.
ఆదివాసీలతో అడుగులు....
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రంప చోడవరం నియోజకవర్గానికి చెందిన ఆదివాసీలు డీజేపురం వద్ద వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా తమ బాధలు, సమస్యలు చెప్పుకొన్నారు. అనంతరం ఆదివాసీ సంప్రదాయ బద్ధంగా ధరించే తలపాగాను జననేత శిరస్సుపై ఉంచారు. కొమ్ములతో కూడిన తలపాగాను ధరించడమే కాకుండా విల్లు ఎక్కుపెట్టారు. అంతేకాకుండా ఆదివాసీ మహిళలతో కలసి కాసేపు పాదయాత్ర చేశారు. దీంతో గిరిజన మహిళలు పట్టరాని సంతోషానికి లోనయ్యారు.
పాదయాత్రికుడి వెంట పార్టీ శ్రేణులు
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, సమన్వయకర్తలు పర్వత పూర్ణచంద్రప్రసాద్, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, ఆకుల వీర్రాజు, నాగులాపల్లి ధనలక్ష్మి, అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పార్టీ నాయకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, పితాని అన్నవరం, కర్రి పాపారాయుడు, అలమండ చలమయ్య, బెహర దొరబాబు, ఈగల అప్పారావు, వాసిరెడ్డి జమీల్, శెట్టిబత్తుల కుమార్రాజా తదితరులు నడిచారు.
స్థానిక సమస్యలతో బాధితులు
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియింబర్స్మెంట్ ప్రస్తుతం సక్రమంగా అందడం లేదని, విద్యార్థులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారని పలువురు విద్యార్థులు జగన్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్తోనే మంచి రోజులు వస్తాయని, విద్యార్థుల కోసం ప్రకటించిన పథకాలు మా భవిష్యత్కు ఉపయోగపడతాయన్న నమ్మకం ఉందని విశ్వససిస్తూ సదరు విద్యార్థులంతా జననేతకు గులాబీ పూలు ఇచ్చి హర్షాన్ని తెలియజేశారు. సామాన్య మహిళల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో చేశారని పలువురు మహిళలు జగన్ను కలిసి గుర్తు చేశారు. కానీ, తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదని ఆక్షేపించారు. జగన్ సీఎం అయితేనే మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు ఇళ్లు మంజూరు చేయడం లేదని డీజేపురానికి చెందిన గొల్ల అమ్మాజీ, నక్కల దేవుడమ్మ, కొల్లి లోవరాజు, నక్కల దేవి పాదయాత్ర ద్వారా తమ వద్దకు వచ్చిన జగన్ ఎదుట వాపోయారు. అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. 75 ఏళ్లైనా పింఛను మంజూరు కాలేదని కొల్లు నాగరాజు అనే వృద్ధుడు జగన్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
అర్హత ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం తనకు పింఛను ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. తనకు పింఛను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని డీజేపురానికి చెందిన కొల్లి భూలక్ష్మి, అప్పలనర్సమ్మ తదితరులు జగన్ వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నవరం, ఎస్.అగ్రహారం తదితర ప్రాంతాలకు వెళ్లి పిల్లలు చదువుకోవల్సి ఉందని, బస్సుల్లేకపోవడం వల్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోయారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. వైఎస్సార్ హయాంలో మంజూరైన పింఛన్ను ఈ ప్రభుత్వం తీసేసిందని, వెయ్యి రూపాయలు పింఛను ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఉన్న పింఛన్ను తీసేసి రోడ్డున పడేసిందని, నాలుగేళ్లుగా నరకం చూస్తున్నామని పారుపాక జంక్షన్కు చెందిన మసలపాక సూర్యారావు వైఎస్ జగన్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణాల్లో ఒక్క రూపాయి మాఫీ చేయలేదని డీజే పురానికి చెందిన అంజన్కుమార్ ఆవేదన వ్యక్తం చేయగా, ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదని గొర్ల అమ్మాజీ ఫిర్యాదు చేశారు.