చనిపోయిన భర్తను ఎక్కడి నుంచి తేవాలయ్యా..

People Sharing There Sorrows To Ys Jagan - Sakshi

‘నా భర్త దాసన్న పదేళ్ల కిందట మృతి చెందాడు. నా చేతివేళ్లు పడటం లేదని రెండేళ్లుగా డీలర్‌ రేషన్‌ సరుకులు ఇవ్వడం లేదు.. అదేమని అడిగితే.. సరుకులు కావాలంటే నా భర్తను తీసుకురావాలని డీలర్‌ అంటున్నాడు.. అంటూ శింగనమల మండలం కల్లుమడికి చెందిన ఎల్లమ్మ అవ్వ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తన కుమారుడు ఇంట్లోంచి గెంటేశాడని.. ఇంటికి అద్దె చెల్లించలేక అప్పులు చేస్తున్నానని వాపోయింది. ‘చనిపోయిన భర్తను నేనెక్కడి నుంచి తేవాలయ్యా’.. అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.  

ముంపు బాధితులను పట్టించుకోలేదు  
చాగల్లు రిజర్వాయర్‌ ముంపు గ్రామం ఉల్లికల్లును ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని గ్రామ సర్పంచ్‌ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పరంధామరెడ్డితో పాటు గ్రామస్తులు శివరామిరెడ్డి, హరిబాబురెడ్డి, విశ్వనాథరెడ్డి, జయశంకర్, సుధాకర్‌రెడ్డి, దస్తగిరి, లక్ష్మీదేవమ్మ తదితరులు  జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా ముంపు గ్రామాలకు పరిహారం ఇచ్చిన ప్రభుత్వం ఉల్లికల్లును నిర్లక్ష్యం చేస్తోందని వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తిచేశారు.  

రుణమాఫీ సొమ్ము వడ్డీకే సరిపోయింది  
రుణమాఫీ సొమ్ము వడ్డీకే సరిపోయిందని శింగనమల మండలం నాగులగుడ్డం గ్రామానికి చెందిన రైతు సూర్యనారాయణ జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తంచేశాడు. తనకు ఐదెకరాల పొలం ఉందని, సిండికేట్‌ బ్యాంకులో రూ.లక్ష క్రాప్‌ లోన్, అనంతపురంలోని లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌లో రూ.2 లక్షల గోల్డ్‌ లోన్‌  తీసుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు హామీ ప్రకారం రూ.1.50 లక్షలు మాఫీ అవుతుందని సంబరపడ్డానని, మూడేళ్లకు రూ.47 వేలు మాత్రమే మాఫీ అయిందని, అవి వడ్డీకే సరిపోయాయని వాపోయాడు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top