నేనున్నాననీ.. భవిత మనదేననీ..
తూర్పుగోదావరి :అన్నొస్తాడు చూద్దామని ఓ సోదరి.. సెల్ఫీ తీసుకోవాలని మరో చెల్లెమ్మ.. కొడుక్కి అక్షరాభ్యాసం చేయిద్దామని ఇంకొక ఆత్మీయురాలు.. కొడుకొస్తాడు.. పలకరిద్దామని ఓ అమ్మ.. జననేతను చూద్దామని ఎక్కడెక్కడి నుంచో ఎండనక వచ్చి పలకరించి.. తోచినది తినడానికి ఇచ్చి.. ఏదో ఒక బహుమానం ఇచ్చి అభిమానం చాటుకుంటున్న ఎందరో జిల్లా వాసులు. ఒకసారి గుండెలో పెట్టుకుంటే ఎప్పటికీ విడువని గోదావరి జిల్లాల ప్రజల అభిమానానికి అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు జననేత జగన్. అన్నగా.. తమ్ముడిగా.. కొడుకుగా.. రాజన్న బిడ్డగా.. ప్రతి ఇంటా ఏదో ఒక బాంధవ్యానికి కట్టుబడిపోయి వారు అడిగినది కాదనకుండా హామీ ఇస్తూ ముందుకు సాగారు జగన్. ఆదివారం రావులపాలెం మండలం వెదిరేశ్వరం నుంచి కొత్తపేట మండలం గంటి వరకూ ప్రజా సంకల్పయాత్ర సాగింది.
కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలి– చిట్టూరి సత్యనారాయణ, మాజీ సర్పంచ్, వెదురేశ్వరం.
తూర్పుగోదావరి :ఆరుగాలం కష్టపడి పంటలు పండించే కౌలు రైతులకు వడ్డీలేని రుణాలను అందించాలి. ఐదు ఎకరాలు ఉన్న రైతులకు రుణాలు ఇస్తున్నారు. కౌలు రైతులకు పెట్టుబడి పెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి వ్యవసాయం చేయాల్సి వస్తోందని జగనన్నకు వివరించాను.
చక్కిడాలు తినిపించడం ఆనందంగా ఉంది – కర్రి ధనలక్ష్మి, చిర్ల చంద్రావతి, వెదిరేశ్వరం
తూర్పుగోదావరి :ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మా గ్రామానికి వచ్చిన జగన్ను కలిసి మేము సిద్ధం చేసిన చక్కిడాలు తినిపించడం ఆనందంగా ఉంది. వెదిరేశ్వరం వచ్చిన జగన్ను కలుసుకుని మేము తెచ్చిన అరిసెలు, చక్కిడాలు, ఆకుపకోడి, జంతికలు ఇచ్చాం. చాలా సంతోషం అనిపించింది.
జగన్ను కలవడం కోసం వచ్చాను– కాండ్రేగుల సూర్యప్రకాష్రావు, దివ్యాంగుడు
జగన్మోహన్రెడ్డి అంటే నా ఎంతో అభిమానం. ఆయన్ను కలవడం కోసమే అమలాపురం నియోజకవర్గం నుంచి వచ్చాను. ఎలాగైనా జగనన్నను కలవాలని వచ్చాను. నా కోరిక తీరింది.
సంబంధిత వార్తలు