విన్నపాలు వింటూ.. భరోసా ఇస్తూ...

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : అందరి కళ్లూ ఆవైపే.. అదిగదిగో అన్నొచ్చేస్తున్నాడు.. గోడు చెప్పుకుంటే ఆయనే చూసుకుంటాడన్న నిశ్చింత.. ప్రజా సంకల్ప యాత్ర జిల్లాలో ప్రవేశించిన రెండో రోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ఆసాంతం పలకరింపులు, విన్నపాలు, ఆత్మీయ స్పర్శలతో సాగింది. విభిన్న వర్గాల ప్రజలు వారి సమస్యలను జననేతకు విన్నవించుకున్నారు. అలుపెరగక ప్రతి సమస్యనూ చిరుదరహాసంతో వింటూ నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు సాగిపోయారు జనహృదయాధినేత జగన్‌.

నా బిడ్డకు సదరమ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదు – మేడపాటి లక్ష్మి, ధవళేశ్వరం
నా బిడ్డ మేడపాటి వీరవేణికి 25 ఏళ్లు. పుట్టుకతోనే మానసిక దివ్యాంగురాలు. సరిగా నడవలేదు. ఐదు నెలల క్రితం బాత్‌రూంలో పడిపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. వికలాంగ పింఛను మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకుంటే సదరమ్‌ సర్టిఫికెట్‌ అడుగుతున్నారు. సర్టిఫికెట్‌ కోసం రాజమహేంద్రవరం, కాకినాడల్లో నిర్వహించిన శిబిరాలకు కాళ్లు అరిగేలా నా బిడ్డను ఎత్తుకుంటూ తిరిగాను. అయినా సర్టిఫికెట్‌ మంజూరు చేయడంలేదు.

ఆయుష్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది – ఎం.విజయ, ఎస్‌ఎన్‌ఓ, ధవళేశ్వరం పీహెచ్‌సీ
ఆయుష్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రతలేకుండా పోయింది. నాలుగు నెలలుగా జీతాలు లేవు. రాష్ట్రంలో ఇటీవల సుమారు 200 మందిని తొలగించారు. పీహెచ్‌సీల్లో వైద్యులు ఉండటంలేదు కాబట్టి సిబ్బందిని తొలగించేస్తున్నామని చెబుతున్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పును కూడా అమలు చేయడంలేదు.

దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు ఇప్పించాలి– నల్లమిల్లి వీర్రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు,  రాజమహేంద్రవరం
రాష్ట్రంలో సుమారు లక్ష మంది వరకు దస్తావేజు లేఖర్లుగా, వారి సహాయకులుగా, టైపిస్టులుగా పనిచేస్తూ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం మా లైసెన్సులు నిలిపివేయడమే కాకుండా కంప్యూటరీకరణ, ప్రైవేటీకరణ పేరుతో మా ఉపాధిని దెబ్బతీస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల మేమంతా రోడ్డున పడతాం. అన్నా! మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి లైసెన్సులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలన్నా!

ఎర్రకొండలో వసతులు లేవు– దోని భాగ్యారావు, ఎర్రకొండ, ధవళేశ్వరం
ధవళేశ్వరం ఎర్రకొండలో ఎటువంటి మౌలిక వసతులు లేవు. డ్రైనేజీలు ఉన్నా ఎటువంటి ఉపయోగం లేదు. మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత మా ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించి సమస్య పరిష్కరించాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top