అందరి బంధువయ
పశ్చిమగోదావరి : కష్టం వస్తే అయిన వాళ్లతోనే చెప్పుకుంటాం.. నాయకులు ఎందరున్నా.. కొందరికే మనం మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం.. జిల్లా ప్రజలు అటువంటి ప్రేమ, ఆప్యాయతలను వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చూపుతున్నారు. జనమంతా తమ ఆత్మ బంధువును చూడటానికి బారులు తీరుతున్నారు. తమలో ఒకరిగా ఆ జననేతను భావించి సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇలా జిల్లాలో మంగళవారం కూడా ప్రజాసంకల్పయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
పింఛన్ తీసేశారు
బాబూ నా వయస్సు 73 సంవత్సరాలు పైన ఉంటుంది. ఇటీవల పింఛన్ ఇచ్చినట్టు ఇచ్చి టీడీపీ పాలకులు తీసేశారు. అదేమని అడిగితే సమాధానం చెప్పే నాథుడు కరువయ్యారు. దీంతో నాకు కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. నాకు మళ్లీ సామాజిక పింఛన్ ఇప్పించి న్యాయం చేయాలని ఆడపా నాగేశ్వరరావు అనే వృద్ధుడు గణపవరం మండలం వీరేశ్వరపురం వద్ద ప్రజాసంకల్పయాత్ర చేస్తోన్న వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకుని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్రెడ్డి ఆయన్ని ఆప్యాయంగా పలకరించారు.
70 ఏళ్లు పైబడినా పింఛన్ లేదు
పశ్చిమగోదావరి : నాకు 75 ఏళ్లు పై బడినా పింఛన్ రావడం లేదు. నేను కళాకారుడిని కూడా.. కళాకారుల పింఛన్ కూడా ఇవ్వడం లేదు. వృత్తి రీత్యా నేను హరిదాసుని, రామాయణం, కాలజ్ఞానం, భక్తరామదాసు చరిత్ర వంటి గీతాలాపన కూడా చేస్తూ అందరినీ అలరిస్తున్నాం. మీరే నన్ను ఆదుకోవాలన్నా అంటూ పెంటపాడుకు చెందిన బోలి ఎల్లయ్య పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసుకుని తన బాధను చెప్పుకున్నారు. పింఛను ఇప్పించాలని కోరారు.