కార్పొరేట్ కంపెనీల కోసం మమ్మల్ని రోడ్డున పడేశారన్నా
కృష్ణాజిల్లా : ‘అన్నా.. టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు స్థలాలను కేటాయించడం కోసం నిరుపేదలమైన మమ్మల్ని కట్టుబట్టలతో రోడ్డున పడేసింది’ అంటూ గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ అకాడమీ ప్రాంతానికి చెందిన షేక్ పర్వీన్, ఎస్కే మహాబులాలు జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్ను కలసి సమస్యలు మొరపెట్టుకున్నారు. ఆర్టీసీ అకాడమీ సమీపంలో ఓ ప్రైవేట్ కంపెనీ కోసం ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా తమ ఇళ్లను బలవంతంగా పడగొట్టారని, చంటిపిల్లలు, సామగ్రితో రోడ్డున నిలబెట్టారని కన్నీటిపర్యంతమయ్యారు. అద్దె ఇళ్ల కోసం వెళ్తే వేల రూపాయలు అడుగుతున్నారని వాపోయారు. కూలినాలి చేసుకునే తాము అంత అద్దెలు చెల్లించలేక యాతన పడుతున్నామని, న్యాయం జరిగేలా చూడాలని జగన్ను కోరారు.
సంబంధిత వార్తలు