ఆరోగ్యశ్రీ వర్తించదు అంటున్నారు
గుంటూరు: నా కూతురు ఎస్తేరురాణి నరాల సమస్యతో బాధపడుతుంది. ఇంటర్మీడియెట్ వరకు చలాకీగానే తిరిగింది. కాళ్లు సక్రమంగా పని చేయకపోవడంతో గతేడాది నుంచి ఇంటికే పరిమితమైంది. డాక్టర్లను సంప్రదిస్తే ఈ జబ్బుకు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పడంతో ప్రతి నెలా రూ.3వేలు ఖర్చు చేసి గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నాం’ అని వైఎస్సార్ కాలనీకి చెందిన సామ్రాజ్యం జననేత జగన్ను కలిసి తన బాధలు తెలిపారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి నేడు టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడిచి పేదలను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని జగన్కు తెలిపారు.
ఆదుకోండన్నా..
‘అన్నా.. చీకటై పోతున్న నా జీవితానికి వెలుగును ప్రసాదించండి’ అంటూ విద్యార్థి బొజ్జ వెంకటకిరణ్ జననేత జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. చిలకలూరిపేటలోని వైఎస్సార్ కాలనీ వద్ద జగన్ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. రెండేళ్ల క్రితం కళ్లకు ఎలర్జీ రావడంతో చూపు మందగించిందని చెప్పాడు. వైద్యులకు చూపిస్తే నయం కావడానికి పెద్ద మొత్తం ఖర్చవుతుందంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యపై ఆసక్తి ఉన్నా చూపు సక్రమంగా లేకపోవడంతో చదువులో రాణించలేకపోతున్నానని కన్నీట పర్యంతమయ్యాడు.