బెల్టు షాపులతో కుటుంబాలు గల్లంతు
సాక్షి, గుంటూరు:‘అన్నా..గ్రామంలో బెల్టు షాపులు లేకుండా చేస్తే మా కుటుంబాలు బాగు పడతాయి’ అంటూ ములుకుదురు గ్రామానికి చెందిన మహిళలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ములుకుదురు చేరుకున్న జగన్ను కలసిన మహిళలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. నిత్యం కూలి పనులకు వెళ్లి సంపాదించే డబ్బు తాగుడుకు బానిసలైన తమ ఇంటి మగవాళ్లకే సరిపోతోందంటూ వాపోయారు. ఊళ్లో మద్యం ఏరులై పారుతుంటే.. అందులో తమ కుటుంబాలు కొట్టుకుపోతున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామంలో బెల్టు షాపులు లేకుండా చేయాలని దళితవాడకు చెందిన మద్దెల విజయమ్మ, కంతేటి శ్యామల, నేలపాటి బుజ్జి జననేతకు విజ్ఞప్తి చేశారు.