చేతి వృత్తులకు ఆదరణ కరువు
సాక్షి, గుంటూరు:‘అన్నా.. డిగ్రీ చదివినా ఉద్యోగం రాలేదు. కులవృత్తిని నమ్ముకుని ఆరేళ్లుగా కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నా. ఏటా ప్రభుత్వానికి మూడు వేలు శిస్తు చెల్లిస్తున్నా. ఈ ఏడాది నాలుగు వేలు కట్టించుకున్నారు. ఈ ప్రభుత్వంలో చేతి వృత్తులకు ఆదరణ కరువైంది’ అంటూ కల్లుగీత కార్మికుడు కందుల భవన్నారాయణ జననేత ఎదుట వాపోయారు. ములుకుదురు గ్రామంలో పర్యటిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి సమస్యలు విన్నవించారు. కనీసం ప్రభుత్వం కల్లుగీసుకునే లైసెన్సు కూడా ఇవ్వలేదన్నారు. ప్రమాదవశాత్తూ ఏమైనా జరిగితే ఆదరించే వారు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి వృత్తుల వారికి బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు.